- తెలుగు వర్శిటీకి సురవరం పేరు మార్పుపై సీయం వివరణ
- రెండు వర్శిటీలకు ఒకే పేరు సాధ్యం కాదన్న రేవంత్ రెడ్డి
ఒకే పేరుతో రెండు విశ్వవిద్యాలయాలు ఉంటే పాలనా పరంగా గందరగోళంగా ఉంటుందని అందుకే రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలకు పేర్లు మార్చే ప్రక్రియ కొనసాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు మార్చి సురవం ప్రతాపరెడ్డి పేరును పెట్టడంపై బీజేపీ వ్యక్తం చేసిన అభ్యంతరాలకు సోమవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి సవివరంగా సమాధానం చెప్పారు. రాజకీయాలు కలుషితమయ్యాయో లేక నాయకుల ఆలోచనలు కలుషితమయ్యాయో తెలియడం లేదని ఒక విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు మార్చినంత మాత్రాన ఆయన కృషిని తక్కువ చేసి చూసినట్లు భావించకూడదని సీయం హితవు పలికారు. పొట్టి శ్రీరాముల ప్రాణత్యాగం తెలుగు జాతి ఉన్నంత వరకూ అందూ స్మరించుకోవాలన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన వారిని స్మరించుకుని కొన్ని సంస్ధలకు వారి పేర్లు పెట్టుకున్నామని రాష్ట్ర విభజన తరువాత గత పదేళ్ళుగా ఈ ప్రక్రియ కొనసాగుతోందని సీయం తెలిపారు. ఈ పేర్ల మార్పుపై కొందరు కొన్ని వర్గాలకు అపోహ కలిగించే ప్రయత్నం చేస్తున్నారని, కేంద్ర పదవుల్లో ఉన్నవారు కూడా ఇలా చేయడం సమంజసం కాదన్నారు. ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీకి కాళోజీ పేరు పెట్టుకున్నామని అలా అని ఎన్టీఆర్ ని అవమానించినట్లు కాదన్నారు సీయం. ఆలాగే ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ జయశంకర్ పేరు, వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్శిటీకి పీవీ నరసింహారావు పేరు, వైఎస్.రాజశేఖర్రెడ్డి పేరుతో ఉన్న హార్టీ కల్చర్ యూనివర్శిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకున్నామని ఈ క్రమంలోనే తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టుకున్నామని సీయం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ పాత పేరులే కొనసాగుతున్న సంస్ధలకు, యూనివర్శిటీలకు మనం పేర్లు మార్చుకున్నామని అంతే తప్ప వ్యక్తులను అగౌరవ పరచే ఉద్దేశం ఎవరికీ లేదని చెప్పారు. విశాల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు బాధ్యతాయుత పదవుల్లో ఉన్న కొందరు నాయకులు కులాన్ని ఆపాదించడం శోచనీయమన్నారు. కుల, మత ప్రాతిపదికన విభజించి రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకోవడం తప్పని సీయం హితవు పలికారు. గుజరాత్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుతో ఉన్న స్టేడియం పేరు తొలగించి ప్రధాని మోదీ పేరు పెట్టారని మేము అలాంటి తప్పిదాలు చేయలేదు… చేయము కూడా అని రేవంత్ రెడ్డి తెలిపారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టుకుందాం చిత్తశుద్ధి ఉంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్లు కేంద్రం నుంచి అనుమతులు తీసుకురావాలని సీయం సూచించారు. బల్కంపేట నేచర్ క్యూర్ హాస్పిటల్ కు రోశయ్య పేరు పెట్టుకుందాం, రోశయ్య సేవలను కీర్తించుకునేలా అక్కడ వారి విగ్రహాన్ని ఆవిష్కరించుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు.