తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహానికి కారణమేంటి? సీఎల్పీ మీటింగ్లో సీఎం చేసిన కామెంట్స్ వెనుక ఉన్న మతలబు ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల వ్యవహార శైలి ఎలా ఉంది? కేసీఆర్ వ్యూహాలను తలదన్నేలా రేవంత్ రెడ్డి సాగిస్తున్న పాలనకు కొందరు నేతలు తూట్లు పొడుస్తున్నారా? ఇప్పుడీ అంశం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఆ సమావేశంలో ఉన్న వాళ్లందరినీ అవాక్కయ్యేలా చేసింది. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా.. బీఆర్ఎస్ పార్టీ నేతలు విమర్శలు చేస్తుంటే పట్టనట్లుగా ఉండటం సరికాదని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీతో సన్నిహిత సంబంధాలు పెంచుకోవడమేంటని రేవంత్ నిలదీశారని చెబుతున్నారు. బీఆర్ఎస్ నాయకులతో సన్నిహితంగా ఉంటే వచ్చే ఎన్నికల్లో మీపై ఆ పార్టీ నుంచి పోటీ పెట్టరని అనుకుంటున్నారా..? అని ముఖ్యమంత్రి మండిపడ్డారట. ఒక్కసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో సీఎల్పీ మీటింగ్లో ఉన్నవాళ్లంతా కంగు తిన్నారట. ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం వెనుక కారణమేంటని జోరుగా చర్చ జరుగుతోంది. ఇక, అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సభలో ఉన్న కొందరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరావు కూడా కేసీఆర్ దగ్గరకి వెళ్లి మరీ కుశల ప్రశ్నలు వేశారని చెబుతున్నారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి వాకబు చేశారట. అశ్వారావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ కూడా విడిగా కేసీఆర్ను మర్యాద పూర్వకంగా కలిశారని అంటున్నారు. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తన తమ్ముడి కుమారుడి వివాహానికి రావాలంటూ కేసీఆర్కు ఆహ్వానపత్రం అందించారు. అసెంబ్లీలో కేసీఆర్తో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు మర్యాదపూర్వకంగా మాట్లాడటం, ఆయనతో మాట్లాడేందుకు ఆసక్తి చూపించడం గమనించిన సీఎం రేవంత్ రెడ్డి… కేసీఆర్తో మాట్లాడిన అంశాన్ని ప్రస్తావించకుండా పరోక్షంగా వరుస బెట్టి అందరికీ చురకలంటించారన్న చర్చ పీసీసీలో సాగుతోంది. అంతేకాదు.. రవీంద్ర భారతిలో ఉద్యోగ పట్టాల పంపిణీ కార్యక్రమంలో కూడా కేసీఆర్పై రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఆ పరిణామంలో భాగమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై కొందరు లోలోపల మాట్లాడుతుండగా… మరికొందరు బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. కొందరు నేతలు, ఎమ్మెల్యేలు అయితే కొద్దిరోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీతో సన్నిహితంగా ఉంటున్నారనే అనుమానాం సీఎం రేవంత్ రెడ్డికి వచ్చిందంటున్నారు. ఇక, అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ కండువా కప్పుకున్న పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో కొంత మంది యూ టర్న్ తీసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే.. మాజీ ఎమ్మెల్యే కోనప్ప లాంటి వాళ్లు సైతం బహిరంగంగానే కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ.. కేసీఆర్ను పొగుడటం వంటివి కూడా ముఖ్యమంత్రి రేవంత్కు చికాకు తెప్పిస్తున్నాయంటున్నారు. మరోవైపు.. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న విమర్శలను సైతం నేతలెవరూ సరిగ్గా తిప్పికొట్టడం లేదని ఈ పరిణామం కూడా రేవంత్కు ఆగ్రహం కలిగించిందంటున్నారు. ఈ పరిస్థితుల మధ్యే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు కేసీఆర్ను పలకరించడం, చనువుగా మాట్లాడటం కూడా రేవంత్ రెడ్డికి చికాకు తెప్పించిందంటున్నారు. ఇన్ని పరిణామాల మధ్య సీఎల్పీ సమావేశంలో అందరినీ లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ తీసుకున్నారని అనుకుంటున్నారు.