27 C
Hyderabad
Tuesday, July 28, 2026

Live Video

spot_img

తెలంగాణ ఇమేజ్‌ పెంచిన ఐటీ, పరిశ్రమల శాఖ -డిప్యూటీ సీఎం భట్టి

  • రాష్ట్రానికి హైదరాబాద్ తలమానికం

  • పెరుగుతున్న వలసలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించండి

  • వేసవిలో విద్యుత్తు డిమాండ్‌కు అనుగుణంగా ప్రణాళికలు చేసుకోండి

  • ప్రీ బడ్జెట్‌ సమావేశాల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచనలు

ఐటీ, పరిశ్రమల శాఖ సంవత్సర కాలంగా రకరకాల సమ్మిట్స్ నిర్వహించి భారీగా పెట్టుబడులు సాధించి తెలంగాణ రాష్ట్ర ఇమేజ్ ను పెంచిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం ప్రజాభవన్‌లో ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్, పట్టణాభివృద్ధి, ఇంధన శాఖల ఫ్రీ బడ్జెట్ సమావేశాలు జరిగాయి. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి డిప్యూటీ సీఎం ఐటీ, పరిశ్రమల శాఖ సమావేశం నిర్వహించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్వహణ బాధ్యతలు కార్పొరేట్ సంస్థలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్వహణ బాధ్యతను ఒక్కో కార్పొరేట్ కంపెనీకి సీఎస్‌ఆర్‌ నిధుల్లో భాగంగా అప్పగిస్తామని పరిశ్రమల శాఖ అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు.

భారీ పరిశ్రమలకు ఇవ్వాల్సిన ప్రోత్సాకాలను దశలవారీగా విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. రాష్ట్రంలో మెగా లెదర్ పార్కులు, మినీ లెదర్ పార్కుల ప్రగతిని సమీక్షించారు. లెదర్ పార్కులకు కేటాయించిన స్థలాలు ఆక్రమణలకు గురి కాకుండా విలువైన స్థలాలను కాపాడాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. మూడవ శ్రేణి పట్టణాలకు ఐటీ టవర్స్ విస్తరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు.

రాష్ట్రానికి హైదరాబాద్ తలమానికమని, అందుకు అనుగుణంగా మహానగరం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసుకుని, ప్రగతిలో ఉన్న పనులను వేగంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఉపాధి, పెట్టుబడుల దృష్ట్యా పెద్ద ఎత్తున ప్రతి ఏటా వలసలు పెరుగుతున్నాయని, అందుకు అనుగుణంగా రహదారులు, విద్యుత్తు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మున్సిపల్, పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చి ఆ మేరకు నిధులు కేటాయిస్తామని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తే పట్టణీకరణ వేగవంతం అవుతుందన్నారు. రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు చేపట్టాలని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని తెలిపారు.

గ్రీన్ పవర్‌కు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఇంధన శాఖ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సప్లై కాస్ట్ తగ్గించుకోవాలని, రెప్ప పాటు సమయం కూడా కరెంటు అంతరాయం లేకుండా చూసుకోవాలన్నారు. వేసవిలో పంటలు ఎండిపోకుండా విద్యుత్ ఉన్నత అధికారులు నిత్యం పర్యవేక్షణ చేయాలని తెలిపారు. వేసవి నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ప్రాధాన్యత రంగమైన ఇంధన శాఖకు ఆ మేరకు బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటాయని డిప్యూటీ సీఎం తెలిపారు. సమావేశాల్లో స్పెషల్ చీఫ్ సెక్రటరీలు రామకృష్ణారావు, జయేష్ రంజన్, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్, ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ మార్ సుల్తాన్య, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్, పరిశ్రమల శాఖ అధికారులు విష్ణువర్ధన్ రెడ్డి, మెట్రో వాటర్ వర్క్స్ ఎండీ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com