-
వైయస్సార్సీపీ నిరంతరం ప్రజలకు తోడుగా ఉంటుంది
-
అవసరార్థులకు అండగా నిలబడుతుంది
-
ప్రజల తరపున వారి గొంతుక అవుతుంది
-
మళ్లీ వచ్చేది మనమే – వైయస్ జగన్మోహన్రెడ్డి భరోసా
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలకు, పార్టీ శ్రేణులకు కీలక సందేశం ఇచ్చారు.
వైయస్సార్సీపీపై ప్రజల్లో నమ్మకం :
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి 15 సంవత్సరాలు అవుతోందని, 14 ఏళ్ల వైయస్సార్సీపీ ప్రయాణంలో మొదటి రోజు నుంచి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తుందన్నారు. అసలు కష్టాల్లో నుంచి ఈ పార్టీ పుట్టిందని, ప్రజల కష్టాలను వైయస్సార్సీపీ తమ కష్టాలుగా భావించి, ప్రజల తరపున వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ మాదిరిగా ప్రతి అడుగులోనూ పోరాటం చేస్తూ వస్తోందన్నారు. ప్రతిపక్షంలో కూర్చోవడం వైఎస్ఆర్ సీపీకి కొత్త కాదన్నారు. పదిహేనేళ్ల ప్రయాణంలో పదేళ్ల పాటు వైసీపీ ప్రతిపక్షంలోనే ఉందన్నారు. అధికార పక్షానికి ధీటైన సమాధానం ఇస్తూనే వస్తున్నామని చెప్పారు. కళ్లు మూసి తెరిచే సరికే ఇప్పటికే దాదాపు సంవత్సరం అయిపోయిందని, మరో మూడు, నాలుగు సంవత్సరాల్లో మళ్లీ ఈసారి వచ్చేది వైయస్సార్సీపీనే అని పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. వైయస్సార్సీపీకి చెందిన ప్రతి కార్యకర్త కూడా గ్రామంలోని ఏ ఇంటికైనా ధైర్యంగా వెళ్లగలడని, ఏ పేద ఇంటికైనా వైయస్సార్సీపీ కార్యకర్త సగర్వంగా, కాలర్ ఎగరేసుకుని వెళ్లగలిగే పరిస్థితి ఉందన్నారు. ఆ కార్యకర్తను చూసినప్పుడు ఆ ఇంటిలోని ప్రతి అక్క , ప్రతి చెల్లి, ప్రతి సోదరుడు, ప్రతి అవ్వ, తాత, ప్రతి రైతు చక్కని చిరునవ్వుతో వైయస్సార్సీపీ కార్యకర్తను పలకరిస్తారన్నారు. ఎందుకంటే వైయస్సార్సీపీ ఎప్పుడైనా చెప్పిందంటే చేస్తుందన్న నమ్మకం ఈరోజు రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో కూడా ఉందన్నారు.
పిల్లల సమస్యలపై ‘యువతపోరు’:
రాష్ట్రంలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత యాదృచ్ఛికంగానే విద్యాదీవెన, వసతిదీవెనకు సంబంధించి, పిల్లలకు జరుగుతున్న అన్యాయాలకు సంబంధించి నిరసన కార్యక్రమం జరుగుతోందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 10 నెలలు అవుతోందని, ఈ 10 నెలల కాలంలో, ఎన్నికల ముందు వాళ్లు చెప్పిన సూపర్సిక్స్, సూపర్ సెవెన్ హామీలన్నీ గాలికెగిరిపోయాయన్నారు. చదువులు కానీ, వైద్యం కానీ, గవర్నెన్స్ కానీ, వ్యవసాయం కానీ.. ఏది చూసినా వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయన్నారు. చదువుకునే పిల్లలకు సంబంధించి, ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించి, ఒక్కొక్క క్వార్టర్కు రూ.700 కోట్ల చొప్పున, విద్యాదీవెన కింద ఏడాదికి నాలుగు క్వార్టర్లకు రూ.2,800 కోట్లు కేటాయించాల్సి ఉంటుందని, వసతి దీవెన కింద ప్రతి ఏడాది ఏప్రిల్లో రూ.1,100 కోట్లు కేటాయించాల్సి ఉంటుందని, అంటే గత ఏడాది ఈ రెండింటికి సంబంధించి పిల్లల చదువుల కోసం మొత్తం రూ.3,900 కోట్లు కేటాయించాల్సిన పరిస్థితుల్లో.. కూటమి ప్రభుత్వం కేవలం రూ.700 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితి ఉందన్నారు. అంటే రూ.3,200 కోట్లు బకాయిలు పెండింగ్లో పెట్టారని మండిపడ్డారు. అదే విధంగా ఈ ఏడాది 2025–26కి సంబంధించి కూడా విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద మరో రూ.3,200 కోట్లు బకాయి పడిందని.. రెండు సంవత్సరాలకు అన్నీ కలిపి చూస్తే.. ప్రభుత్వం విద్యార్థులకు మొత్తం దాదాపు రూ.7,100 కోట్లు కేటాయించి, పిల్లలను ఆదుకోవాల్సింది పోయి, కేవలం రూ.2,600 కోట్లు మాత్రమే నామమాత్రంగా కేటాయించి, పిల్లల చదువులతో ఆడుకుంటోందన్నారు. ఇలాంటి ఈ కూటమి ప్రభుత్వానికి పిల్లలు, వారి తల్లిదండ్రులు బుద్ది చెప్పే కార్యక్రమం తీసుకోవాలని.. పిలుపునిచ్చారు.
నిరంతరం ప్రజలతోనే పార్టీ :
వైయస్సార్సీపీ ఎప్పుడు కూడా ప్రజలకు తోడుగా ఉంటుందన్నారు. ప్రజలకు ఎప్పుడు అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు. ప్రజల తరపున ఎప్పుడూ గొంతుకై, వారికి అండగా ఉంటుందని ఇవాళ.. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి, కృతజ్ఞతలు తెలియజేశారు. అదే విధంగా పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీలో ప్రతి నాయకుడు, కార్యకర్తకు అభినందనలు తెలియజేశారు వైయస్ జగన్.
ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ, పార్టీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణితో పాటు.. పలువురు ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, అనుబంధ విభాగాల అ«ధ్యక్షులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.