- శుక్రవారం పిసిసి విస్తృతస్థాయి సమావేశం.
- తొలిసారి గాంధీభవన్ కోస్తున్న మీనాక్షి నటరాజన్.
- హంగు ఆర్భాటాలకు నో చెప్పిన మీనాక్షి.
- బొకేలు సైతం తేవద్దని ఆదేశాలు.
- అందరి జాతకాలు తన వద్ద ఉన్నాయి అంటున్న మీనాక్షి.
- త్వరలోనే భారీ మార్పులు.
- పార్టీ జిల్లా అధ్యక్షులకు మరిన్ని అధికారాలు
అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది ఏదో అలా అలా గడిచిపోయింది… ఇక నుంచి అలా కాదు… టార్గెట్లు ఉంటాయి… తరచు సమీక్షలు ఉంటాయి… పదవులు వస్తాయి… కొంతమంది పదవులు పోతాయి… ఈ సూత్రంతో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తొలిసారిగా హైదరాబాద్ కు వస్తున్నారు. కాంగ్రెస్ వ్యవహారాల తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జ్ గా మీనాక్షీ నటరాజన్ పేరు ప్రకటించిన తరువాత ఆమె రేపు శుక్రవారం తొలిసారి హైదరాబాద్ గాంధీభవన్లో అడుగుపెట్టబోతున్నారు. శుక్రవారం జరిగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆమె పాల్గొంటారు. గతంలో ఇన్చార్జిలుగా ఉన్నవాళ్లు ఎలా వ్యవహరించారో తెలియదు కానీ ఇకనుంచి మాత్రం అలా ఉండదు అనే ఇండికేషన్ రాష్ట్రంలో ఆమె అడుగుపెట్టక ముందే స్పష్టంగా పంపారు.
కారణాలు ఏమైనా పార్టీలో ఆల్ ఇస్ నాట్ వెల్ అని మీనాక్షి భావిస్తున్నారు. అధిష్టానం తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా ఆమె పేరు ప్రకటించిన వెంటనే ఆమె రాష్ట్రానికి రాకుండానే ఇక్క పార్టీలో జరుగుతున్న వ్యవహారాలపై పూర్తిస్థాయిలో వివరాలు సేకరించారు. తెలంగాణలో ఇటు పార్టీలో అటు ప్రభుత్వంలో జరుగుతున్నా అన్ని అంశాలపై పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాతనే ఆమె హైదరాబాద్కు వస్తున్నారని సీనియర్ నేతలు అంటున్నారు.
గతంలో గాంధీభవన్ లో సమావేశానికి ఇన్చార్జ్ వస్తున్నారంటే కటౌట్లు, బ్యానర్లు హంగామా హడావిడి ఉండేది. కానీ శుక్రవారం జరిగే సమావేశానికి ఇలాంటివి ఏమీ వద్దని ఆమె ఆదేశాలు జారీ చేశారు. తనను అభినందించే వంకతో ఎవరూ కనీసం బొకే కూడా తీసుకురావద్దని నేతలకు గాంధీభవన్ నుంచి సమాచారం అందించారు. మీనాక్షి వ్యవహార సరళిని అర్ధం చేసుకున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఇప్పటి వరకూ గాంధీభవన్ చుట్టూ ఉన్న ఫ్లెక్సీలు, కటౌట్లు, బ్యానర్లన్నింటినీ తొలగిస్తున్నారు.
పిసిసి అధ్యక్ష ఎన్నిక జరిగినప్పటికీ ఇప్పటికీ కొత్త కార్యవర్గం ఏర్పడలేదు. మీనాక్షి నటరాజన్ తెలంగాణలో అన్ని స్థాయి నేతల నుంచి వివరాలు సేకరించిన తర్వాతనే దీనిపై తుది నిర్ణయం తీసుకుని అధికారిక ప్రకటన చేస్తారని నేతలు అంటున్నారు. క్షేత్ర స్ధాయి నుంచి పార్టీని పటిష్ట పరిచే క్రమంలో ఇకపై జిల్లా పార్టీ అధ్యక్షులను అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించేలా మీనాక్షి చర్యలు చేపట్టనున్నారని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. ప్రధానంగా సీనియర్లు, ప్రజలతో మంచి సత్సంబంధాలు ఉండి యాక్టీవ్గా పార్టీ కొరకు పనిచేసే వ్యక్తులను ఎంపిక చేసి జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమించడానికి మీనాక్షి నటరాజన్ ఇప్పటికే తన కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. పేరుకే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కాకుండా ఎనభైయ్యో దశకంలో కాంగ్రెస్ జిల్లా పార్టీ అధ్యక్షులు ఎంత పవర్ ఫుల్గా ఉండే వారో అలా మళ్ళీ జిల్లాలను స్ట్రెన్తెన్ చెయ్యాలనే ఆలోచనతో మీనాక్షీ నటరాజన్ ఉన్నట్లు సమాచారం.
ఇక పార్టీలో క్రమశిక్షణ లేకపోవడం ఇష్ట రాజ్యాంగా ప్రకటనలు చేయడం ఢిల్లీలో రాహుల్ గాంధీతో పరిచయం ఉన్నది కనుక తమను ఏమీ చేయలేరని కొంతమంది అనుకుంటున్న వారికి చెక్ పెట్టడానికి మీనాక్షి నటరాజన్ సిద్ధమవుతున్నారు. అధిష్టానం నుంచి పూర్తిగా క్లియరెన్స్ తీసుకున్న తర్వాతనే ఆమె ఈ మార్పులు చేర్పులకు శ్రీకరం చుట్టడానికి సిద్దమవుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అంటున్నారు.
పార్టీకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఉందని సీనియర్ సైతం అంగీకరిస్తున్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డి హయంలో పార్టీకి ప్రభుత్వానికి మధ్య ఏ విధంగా మంచి సంబంధాలు ఉండేవో అలాంటి పరిస్ధితులనే ఇప్పుడు పునరుద్దరించాలని ఆమె భావిస్తున్నారు.
శుక్రవారం హైదరాబాద్ రానున్న మీనాక్షి నటరాజన్ వరుసగా జిల్లాల వారిగా నాయకులతో భేటీ కానున్నారు. గతంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా వచ్చిన వారిని ఎలాగోలా బుట్టలో వేసుకుని పార్టీలో పదవులు పొందేవారని కానీ ఈసారి మీనాక్షి నటరాజన్తో అలా ఉండదని ఆమె ముక్కుసూటి మనిషి అని ఇప్పటికే పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.