ఇప్పటికే మెట్రో సిటీగా ఎదిగిన హైదరాబాద్ నగరం మరింత విస్తరణపై రేవంత్ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే మూడు సిటీలు, మూడు కమిషనరేట్లతో జనం ఫుల్లుగా నిండిపోగా.. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పేరుతో ఫోర్త్ సిటీని ఏర్పాటు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్ పేట సమీపంలో ఫోర్త్ సిటీని అభివృద్ధి చేస్తున్నారు. అక్కడే స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తుండగా.. హైదరాబాద్ ఓఆర్ఆర్ నుంచి ఫ్యూచర్ సిటీలను కలుపుతూ గ్రీన్ఫీల్డ్ రహదారిని నిర్మించనున్నారు. ఈ రహదారి నిర్మాణం పనులకు కూడా శ్రీకారం చుట్టారు.
గ్రీన్ఫీల్డ్ రహదారి ప్రాజెక్టుకు సంబంధించి పనుల కోసం హెచ్ఎండీఏ టెండర్లను ఆహ్వానించింది. రెండు ప్యాకేజీల్లో ఈ రహదారి పనులు పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ ఔటర్ రింగ్రోడ్డుని రావిర్యాల ఇంటర్ఛేంజ్ 13 నుంచి ఆమన్గల్ రీజనల్ రింగ్ రోడ్డుకు కనెక్ట్ చేస్తూ ఈ రహదారి నిర్మించున్నారు. మొత్తం 41.50 కిలో మీటర్ల పొడవుతో ఈ గ్రీన్ఫీల్డ్ రహదారిని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే రహదారి నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ కొలిక్కి సైతం కొలిక్కి వచ్చింది. దీంతో, రహదారి నిర్మాణానికి హెచ్ఎండీఏ టెండర్లు పిలిచింది. తొలిదశలో రావిర్యాల్ ఇంటర్ ఛేంజ్ నుంచి రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేట్ వరకు 19.2 కిలోమీటర్ల మేర రహదారిని నిర్మిస్తారు. రెండోదశలో మీర్ఖాన్పేట్ నుంచి ఆమన్గల్ వరకు మెుత్తం 22.30 కిలోమీటర్ల మేర రహదారిని నిర్మించనున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, యాచారం, కడ్తాల్, ఆమన్గల్ మండలాలతో పాటు.. 14 గ్రామాలను కలుపుతూ ఈ రహదారిని అందుబాటులోకి తీసుకురానున్నారు.
తొలి దశ- 19.2 కిలో మీటర్ల రహదారి నిర్మాణానికి మొత్తం వ్యయం- రూ.1,665 కోట్లుగా అంచనా వేయగా.. రెండో దశ- 22.30 కిలో మీటర్ల రహదారికి రూ.2,365 కోట్లు అంచనా వ్యయంగా నిర్థారించారు. 100 మీటర్ల వెడల్పుతో యాక్సెస్ కంట్రోల్ ఎక్స్ప్రెస్వేను నిర్మిస్తున్నారు. ఆరు లైన్ల మెయిన్ క్యారేజ్ వేను భవిష్యత్తులో 8 లైన్లుగా విస్తరించేందుకు వెసులుబాటుగా భూసేకరణ చేపట్టారు. ఆ మార్గంలో మెట్రో, రైల్వే కారిడార్ కోసం అటూ ఇటు 20 మీటర్ల వెడల్పుతో భూమి రిజర్వు చేయనున్నారు. పచ్చదనం కోసం 2 మీటర్ల వెడల్పుతో సెంట్రల్ మీడియన్, ఇరువైపులా గ్రీన్బెల్ట్, సైకిల్ ట్రాక్, యుటిలిటీ కారిడార్ ఏర్పాటు చేయనున్నారు. టెండర్ పత్రాలు ఫిబ్రవరి 28 నుంచి సమర్పించాలని.. మార్చి 21న సాంకేతిక బిడ్లు తెరవనున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. కాగా, ఈ రహదారి నిర్మాణంతో ఆయా గ్రామాల్లో భూముల ధరలకు రెక్కలు రానున్నాయి. ఇప్పటికే అక్కడ ఎకరం భూమి కోట్లలో పలుకుతుండగా.. ఆ ధరలు ఇప్పుడు గ్రీన్ఫీల్డ్ రహదారి వస్తే మరింతగా పెరగనున్నాయి.