అనేక ఆందోళనలు, అల్లర్లతో అట్టుడికించి షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదొసిన విపక్షాలు.. ఇప్పుడు తాత్కాలికంగా యూనుస్ ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే అతని హయాంలో కూడా పరిస్థితులు చేజారుతున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో ప్రభుత్వంపై ఆ దేశ సైన్యం తిరుగుబాటు చేసేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో బంగ్లాదేశ్లో మరోసారి ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఉంది.
బంగ్లాదేశ్ సైన్యాధ్యక్షుడు జనరల్ వఖర్ ఉజ్ జమాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ స్వాతంత్రానికి ముప్పు పొంచి ఉందని చెబుతున్నారు. దేశం మంచి వారి చేతిలో ఉండాలని.. కానీ గడచిన 7, 8 నెలలో చూడకూడనివి చాలా చూశానని చెబుతున్నారు. ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే తాత్కాలిక ప్రభుత్వానికి డెడ్లీ వార్నింగ్ ఇస్తున్నట్టు కనిపిస్తోంది. అంతేకాదు ఆయన మరో కీలక వ్యాఖ్య కూడా చేశారు. తిరుగుబాటు గురించి ముందే చెబుతున్నానని.. తర్వాత ఎందుకు చెప్పలేదని తనను నిందించవద్దంటున్నారు. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే బంగ్లాదేశ్లో మరోసారి డేంజర్ బెల్స్ మోగుతున్నట్టు క్లియర్ కట్గా అర్థమవుతోంది.
నిజానికి జనరల్ జమాన్ చెప్పకనే చెబుతున్న విషయం ఏంటంటే.. దేశంలో త్వరగా ఎన్నికలు నిర్వహించాలని. నిజానికి యూనుస్ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించేవరకు తాత్కాలికంగా అధికారంలో ఉంటుందని మొదట ప్రకటించారు. కానీ నెలలు గడుస్తున్నా.. ఎన్నికలు మాత్రం నిర్వహించడం లేదు. దీంతో కొన్ని విదేశీ శక్తులు యూనుస్ను అడ్డుపెట్టుకొని చక్రం తిప్పాలని చూస్తున్నాయా? అనే ప్రశ్నలు, అనుమానాలు ప్రజల్లో మొదలయ్యాయి. ఈ విషయాన్నే అక్కడి సైన్యం చెబుతోంది. త్వరగా ఎన్నికలు నిర్వహిస్తే సరే.. లేదంటే సైన్యం అధికారాన్ని చేజిక్కించుకుంటుందని ఇప్పుడు నిఘా వర్గాలు కూడా అక్కడి ప్రభుత్వానికి సమాచారం అందించినట్టు తెలుస్తోంది.