చాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాకిస్థాన్ మధ్య కీలక పోరు జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ గెలిచింది. పాక్ ఓడింది. కానీ పాకిస్థాన్ కేవలం మ్యాచ్ మాత్రమే ఓడలేదు. దాని పరువును గంగలో కలుపుకుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫిల్డింగ్.. ఇలా అన్నింటిలో చాలా దారుణంగా ఫెయిల్ అయ్యింది పాకిస్థాన్. దీంతో ఇప్పటికే పీకల్లోతూ కష్టాల్లో ఉన్న పాకిస్థాన్ పై ఇప్పుడు దుమ్మెత్తి పోస్తున్నారు. ఒకప్పటి పాక్ టీమ్ కి.. ఇప్పటి టీమ్ కి అసలు ఏమాత్రం పొంతన లేదు. నిన్నటి ఐసిసి లాంటి బిగ్ మ్యాచ్ లో ఆడుతున్న ఫీలింగే లేదు పాకిస్థాన్ కు.
ఇప్పటికే పాక్ మాజీలు ఆ జట్టుని ఏకిపారేస్తున్నారు. ఒక ప్లాన్ పద్దతి లేదు. పాక్ టీమ్ పై విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. టాలెంట్ పరంగా చూస్తుంటే ఇండియా ముందు ఆ జట్టు దేనికి పనికి రాదు. కానీ బెస్ట్ ప్లేయర్స్ ని ఎంచుకునే అవకాశం మ్యానేజ్మెంట్ కి వుంది. కానీ టీమ్ సెలక్షన్ లో ఎలాంటి పస లేదు. బాబర్ అజామ్, రిజ్వాన్ పై బ్యాటింగ్ భారం పెట్టేస్తున్నారు. వారిద్దరు ఔట్ అయితే మిగతా ప్లేయర్ ఎప్పుడు ఎక్కడ ఎలా ఆడుతారో ఆ దేవుడికే తెలియాలి.
ఇక బౌలింగ్ లో షాహిన్, రావుఫ్ మీదే ఆశలు. పోనీ వాళ్లేమైనా మ్యాజిక్ లు చేస్తున్నారా అంటే.. ఏమీ లేదు. ఆ జట్టుకి సరైన స్పిన్నర్ లేడు. దుబాయి లాంటి వేదికల్లో కూడా ఫాస్ట్ ని నమ్ముకున్నారు. ఇదంతా ప్లానింగ్ లేకపోవడం కాకపోతే మరేం కాదు. ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఆ టీమ్ ఔట్ అయినట్టే. ఇక బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్ లో అయినా గెలిస్తే పరువు దక్కుతుంది. లేదంటే ఈ టీమ్ పరువు ఇక కుంభమేళాలో కలిసిపోయినట్టే.
ఇప్పటికే మాములు అనలిస్ట్ నుంచి మాజీల వరకు అందరూ పాక్ టీమ్ పై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. దీనికి తోడు మేనేజ్ మెంట్, టీమ్ మధ్య విబేధాలు ఉన్నట్టు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇవన్నీ బయటికి తెలియడంతోనే మ్యాచ్ కు ముందు పీసీబీ చైర్మన్ నఖ్వీ టీమ్ ప్రాక్టీస్ సెషన్ లో వారందరిని పలకరించారు. టీమ్ గెలిచినా.. ఓడినా.. టీమ్ తోనే ఉంటామనే స్టేట్ మెంట్ ఇచ్చారు. కానీ ఇవేవీ కూడా పీసీబీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలను బయటపడకుండా ఆపలేకపోయాయి.
పీసీబీ కూడా చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ, భారత్ పై మాటల దాడి చేయడంలో ఉన్న ద్రుష్టిలో కొంచెం కూడా టీమ్ పై ఫోకస్ చేయలేదని తెలుస్తోంది. అసలు నిన్న మ్యాచ్ లో బౌలింగ్ లైనప్ ను చూస్తేనే అర్థమవుతుంది వారి వ్యూహాలు ఎంత చెత్తగా ఉన్నాయో.
ఇక ఫిల్డింగ్ గురించి అయితే ఎంత చెప్పుకుంటే అంత తక్కువ. టీమ్ ఇండియా భారీ షాట్లను ఆడలేని పరిస్థితిలో వికెట్ల మధ్య పరుగులు తీసింది. విరాట్, అయ్యర్ సింగిల్స్ తోనే పాక్ ను కూల్చేశారు. ఈ విషయం తెలిసి కూడా దీన్ని అడ్డుకోలేకపోయింది పాక్.