ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నామని గవర్నర్ చెప్పారు. ప్రభుత్వం తొమ్మిది నెలల పాలనాతీరును కూడా గవర్నర్ తన ప్రసంగంలో వెల్లడించారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, మెగా డీఎస్సీ ఫైల్పై సంతకం, అన్న క్యాంటీన్లు ప్రారంభం వంటటివి ప్రజల అవసరాలు తీరుస్తున్నాయన్నారు. ప్రతినెలా 1వ తేదీనే ఇంటికి వెళ్లి పింఛన్లు.. మహిళలకు ఏడాదికి మూడు సిలిండర్లు అందిస్తున్నామన్నారు. అర్హులైన అందరికీ సొంతిల్లు ఉండాలనేది ఆకాంక్ష అన్నారు. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీలకు ప్రజలు తిరుగులేని మెజారిటీ ఇచ్చారని అన్నారు.
గడిచిన ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని.. ఫలితంగా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని గాడిలో పెడుతుందన్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశామన్నారు. అలాగే, అన్నక్యాంటీన్లను ప్రారంభించి పేదల ఆకలి తీరుస్తున్నామని గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జనాభా తలసరి ఆదాయం పెరిగిందని.. 2047 నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్లు రూ.4వేలకు పెంచామని.. ప్రతినెల 1వ తేదీనే ఇంటికి వెళ్లి లబ్దిదారులకు పింఛన్లు అందిస్తున్నామన్నారు.
పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్లు, విద్య, వైద్యం అందజేస్తున్నామన్నారు గవర్నర్ నజీర్. బీసీల ప్రగతి కోసం ప్రత్యేకంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించామని.. బీసీలకు స్థానికసంస్థలు, నామినేటెడ్ పోస్టుల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించామన్నారు. అలాగే ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు మళ్లీ ఊపందుకున్నాయని.. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయిందన్నారు. రాష్ట్రంలో అర్హులైన పేదలకు సొంతింటి కల నిజం చేస్తామన్నారు. ఐటీ నుంచి ఏఐ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని.. సంక్షేమం, అభివృద్ధి సమన్వయం చేసుకుంటున్నట్లు గవర్నర్ ప్రసంగంలో తెలిపారు. ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్ట్ ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. ఇటీవలే మెరిట్ ఆధారంగా 9 యూనివర్సిటీలకు వీసీలను నియమించామన్నారు. స్థానిక సంస్థల్లో పోటీకి ఇద్దరు పిల్లలే ఉండాలన్న నిబంధన కూడా ఎత్తివేశామన్నారు. ఇక, రాష్ట్రంలో సూర్య ఘర్ యోజన పథకం కింద సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశామని గవర్నర్ ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం నిర్ణయాలతో రాష్ట్ట్రంలోకి పర్యాటక రంగంలో పెట్టుబడులు వస్తున్నాయని.. ఎమ్ఎస్ఎమ్ఈలకు అండగా ఉండి ప్రోత్సహిస్తున్నామన్నారు. యువతకు ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని.. అలాగే గత పాలనలో రాష్ట్రానికి జరిగిన నష్టంపై ఏడు శ్వేతపత్రాల ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలియజేశామన్నారు గవర్నర్.
బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించేందుకు అసెంబ్లీకి చేరుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్కు స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మండలి ఛైర్మన్ మోషేన్ రాజు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతం పలికారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హజరయ్యారు.