- ఎల్లుండితో ముగియనున్న కుంభమేళా
- మరింతగా పోటెత్తుతున్న భక్తులు
- ముగిసే నాటికి కనీసం 65 కోట్లమందికి మించొచ్చు
- అద్భుత సదుపాయాలు, పకడ్బందీ ఏర్పాట్లు
- టెక్నాలజీ, ఎఐ, ఆధునిక ప్లానింగ్
- ఒక్క విషాద ఘట్టం మినహా ప్రశాంతంగా మేళా
ప్రయాగ్ రాజ్ లో ముగింపు దశకు వస్తున్న మహాకుంభమేళా ఇప్పటికీ అశేష భక్త జనం తాకిడితో పోటెత్తుతోంది. ఎల్లుండి మహాశివరాత్రి పర్వదినం రోజున కుంభమేళాకు శాస్త్రోక్తంగా ముగింపు పలుకుతారు. ఆరోజుకు కుంభమేళా సందర్శకులు కనీసం 60 కోట్ల మంది దాటిపోవచ్చని అంచనా వేస్తున్నారు.ఇది ఒక రకంగా రికార్డు. ఇంత ఆధునికత పోకడలు ప్రవేశించినా సనాతన ఆచారాలకు మన హిందూ సంప్రదాయంలో చెక్కు చెదరని నమ్మకం, విశ్వాసం ఉన్నాయని ప్రయాగ్ రాజ్ కుంభమేళా స్పష్టం చేస్తోంది.ప్రపంచం నలుమూలలా సనాతన ధర్మంపై విశ్వాసం అంతకంతకూ పెరుగుతోందనడానికి స్పష్టమైన సంకేతంగా భావించవచ్చు.
కుంభమేళాలో అరుదైన రికార్డులు…
ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో ఇప్పటి వరకూ 60 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించి పవిత్ర కార్యాలు పూర్తిచేసుకోవడం కుంభమేళా చరిత్రలోనే ఒక అరుదైన రికార్డు. యూపీ ప్రభుత్వం ఆంచనాలకు మించిపోయిన ఆదరణ ఇది.. యూపీ ప్రభుత్వం 45 కోట్ల మంది వరకూ రావచ్చని అంచనా వేసింది. మేళా ముగిసే నాటికి దాదాపు భక్తుల తాకిడి 65 కోట్లకు చేరుకోవచ్చని అంచనాలున్నాయి. పవిత్ర తిథుల్లో తాకిడి ః మహాకుంభమేళాకు పవిత్రమైన ఘడియల్లో స్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తారు.ఒక్క సంక్రాంతి రోజునే ఏకంగా 35 లక్షలమంది స్నానాలు ఆచరించగా,ఇక మౌనీ అమావాస్య ఘడియల్లో ఏకంగా 8కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు.
విదేశీయుల స్నానాదులు…
మహాకుంభమేళాలో ప్రపంచం నలుమూలలనుంచి హిందూ భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. భూటాన్ రాజు జిగ్మే సింగే ఖైసర్ వాంగ్ ఛుక్ తో సహా నేపాల్ నుంచి 5కోట్ల మంది పుణ్య ఘడియల్లో స్నానాలు ఆచరించడం మహాకుంభమేళాలోనే అరుదైన రికార్డుగా నిలిచిపోయింది.
అద్భుతమైన సదుపాయాలు…
144 ఏళ్ల తర్వాత విచ్చేసిన పుణ్య తిథుల్లో వచ్చిన మహాకుంభమేళాకు కోట్లలో భక్తులు తరలి వస్తారని ఊహించిన యూపీ ప్రభుత్వం ఎన్నో మౌలికసదుపాయాలు కల్పించింది. ప్రయాగ్ రాజ్ ను మరో 4 వేల హెక్టార్ల స్థలం విస్తరించి మరో కృత్రిమ నగరాన్నే సృష్టించింది. అక్కడ అందరికీ వసతి సౌకర్యాలు కల్పించడమే కాదు ఏఐ సాయంతో క్రౌడ్ మానిటరింగ్ చేయడం, ప్రయాణికుల రాకపోకలకు వీలుగా మార్గాలు కల్పించడం,పుణ్యస్నానాలు చేసే భక్తులు నీట మునగకుండా పకడ్బందీ చర్యలు, అండర్ వాటర్ డ్రోన్ లతో నిఘా, తో పాటు ఎన్నో పుణ్యక్షేత్రాలను నిర్మించింది.అంతేకాదు.. కుంభమేళా కు వచ్చి వ్యాపారాలు చేసుకుని సంతోషపడినవారూ ఉన్నారు.నిరంతర పహారాతో అందరికీ అనువైన ఏర్పాట్లు కల్పిస్తూ ప్రవాహం ప్రశాంతంగా సాగిపోయేలా చర్యలు తీసుకుంది.
దురదృష్టకర ఘటనలు…
మహాకుంభమేళాలో మాఘపౌర్ణిమ ఘడియల్లో జనవరి 29న పుణ్య స్నానం చేసేందుకు తెల్లవారు జామున భక్తులు ఒకేసారి ఎగబడటంతో తొక్కిసలాట జరిగి 30 మంది మరణానికి దారి తీసింది. ఈ విషాద ఘటనలో మరో 60 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఆరోజు పవిత్ర ఘడియలు ముగుస్తున్నాయన్న ఆతృతలో భక్త జనం నెట్టుకుంటూ త్రివేణి సంగమానికి చేరుకోవడంతో కొందరు కింద పడి నలిగి మరణించారు.ఈ ఒక్క ఘటన తప్పితే మరేదీ జరగకుండా అంతా ప్రశాంతంగా సాగిపోయింది. ఈ విషాద సంఘటన తర్వాత యూపీ ప్రభుత్వం మరిన్ని భద్రతా ఏర్పాట్లు చేయడమే కాక ట్రాఫిక్ రాకపోకలను సమీక్షించి స్నానఘట్టాలకు దారి తీసే మార్గాలను మరింత కట్టుదిట్టం చేయడంతో మహాకుంభమేళా ఇప్పటి వరకూ సజావుగా సాగుతోంది.ఎల్లుండి మహాశివరాత్రినాడు మహాకుంభమేళా ముగియనుంది.