MUDA స్కామ్.. కర్ణాటక పాలిటిక్స్ను షేక్ చేసింది. సీఎం పదవిని అడ్డుపెట్టుకొని సిద్ధరామయ్య అనేక అక్రమాలు చేశారంటూ RTI యాక్టివిస్ట్లు చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపిన లోకాయుక్త పోలీసులు అతడికి క్లీన్ చిట్ ఇచ్చాయి. ఆరోపణలను రుజువు చేసేందుకు సరైన ఆధారాలు లభించనందునే క్లీన్ చిట్ ఇస్తున్నట్టు తెలిపింది లోకాయుక్త. సిద్ధరామయ్యతో పాటు.. ఆయన భార్య, మరో ఇద్దరికి కూడా ఈ కేసులో క్లిన్ చిట్ ఇచ్చింది.
సిద్ధరామయ్య భార్య పార్వతికి మైసూరులోని కేసరే గ్రామంలో మూడెకరాల భూమి ఉంది. దాన్ని ఆమె సోదరుడు మల్లికార్జున్ ఆమెకు గిఫ్ట్గా ఇచ్చారు. అయితే ఈ భూమిని అభివృద్ధి కోసం MUDA హ్యాండోవర్ చేసుకుంది. పరిహారంగా 2021లో ఆమెకు దక్షిణ మైసూరులోని ప్రధాన ప్రాంతమైన… విజయనగర్లో 38,283 చదరపు అడుగుల ప్లాట్ను కేటాయించింది. పరిహారం కింద ఇచ్చిన ప్లాట్ మార్కెట్ విలువ… కేసరేలో ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న భూమికంటే ఎక్కువ అని బీజేపీ ఆరోపించింది. దీంతో MUDA కుంభకోణం తెరపైకి వచ్చింది.
దీనిపై విచారణ జరిపిన లోకాయుక్త ఫిర్యాదులో ఉన్న ఆరోపణలకు రుజువు చేసేలా సాక్ష్యాధారాలు లేవని.. అందుకే వారికి క్లీన్చిట్ ఇచ్చినట్టు తెలిపింది. దీనికి సంబంధించిన నోటీసులను ఫిర్యాదు చేసిన స్నేహమయి కృష్ణకు పంపింది. ఈ రిపోర్టుపై ఏవైనా అభ్యంతరాలుంటే చాలెంజ్ చేయవచ్చంది.
నిజానికి ఈ కేసు అనేక మలుపులు తీసుకుంది. ముందుగా మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్థలం కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. సీఎంగా ఉన్న సిద్ధరామయ్య అధికారాన్ని అడ్డుగా పెట్టుకొని భారీగా స్థలాలు కొట్టేశారని ఓ RTI కార్యకర్త ఈ విషయాన్ని గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్కు కంప్లెంట్ చేశారు. దీంతో ఈ వివాదం మొదలైంది. ఆ తర్వాత విచారణకు హాజరవ్వాలని ఏకంగా సీఎంకు నోటీసులు జారీ చేయడం దుమారాన్నే రేపింది. ఈ నోటీసును వెనక్కి తీసుకోవాలని కర్ణాటక మంత్రి మండలి తీర్మానం చేసింది. ఆ తర్వాత సీఎం సిద్ధరామయ్య ఏకంగా హైకోర్టును ఆశ్రయించడం.. అక్కడా ఆయనకు వ్యతిరేకంగా తీర్పు రావడం.. ఇలా అనేక మలుపులు తిరిగింది ఈ కేసు. ఇలా పొలిటికల్ వార్ పీక్స్కు చేరింది. చివరికి ఈ కేసులో సీఎం సిద్ధరామయ్యకు క్లీన్ చిట్ వచ్చింది. దీంతో ఆయనపై వచ్చిన ఆరోపణలన్ని కేవలం ఆరోపణలే అని తేలిపోయింది.