- ఈనెల 16 నుంచి లింగమంతుల స్వామి జాతర
మేడారం జాతర తరహాలోనే రెండేళ్లకోసారి నిర్వహించే మరో అతిపెద్ద జాతర పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర. యాదవుల కుల దైవంగా పెద్దగట్టు లింగమంతులస్వామి జాతర ప్రసిద్ధి చెందింది. ఈ జాతర ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మేడారం తర్వాత తెలంగాణలో అతిపెద్దదిగా పిలువబడే గొల్లగట్టు జాతర రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. పెద్దగట్టు జాతరను విజయంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.
ఈ నెల 16న జాతర ప్రారంభమై ఫిబ్రవరి 20వ తేదీతో ముగియనుంది. జాతర ఏర్పాట్ల నిమిత్తం ప్రభుత్వం రూ.5 కోట్లు కేటాయిస్తూ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్క తెలంగాణ నుంచే కాకుండా పలు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు అధికారులు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట జిల్లా కేంద్రానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పెద్దగట్టు. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న దురాజ్ పల్లి గ్రామం ప్రక్కనే ‘పాలశేర్లయ్యగట్టు’ అని పిలుచుకునే గొల్లగట్టుపైన ఈ జాతర జరుగుతుంది. సుమారు 1000 ఏళ్లుగా ఈ జాతర జరగుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. శివుడినే లింగమంతుల స్వామిగా, చౌడమ్మను శక్తి స్వరూపిణిగా భక్తులు కొలుస్తారు. వాస్తవానికి ఎదురుగా ఉన్న ఉండ్రుకొండ పైన రెండు గుడులను కట్టి శివునికి నైవేద్యంతోను, చౌడమ్మకు జంతు బలులతోను ఈ జాతరను నిర్వహిస్తారు. ఇప్పటికీ పెద్దగట్టు గిరిదుర్గంపై ఈ గుడులున్నాయి. అందుకే దీనిని ‘పెద్దగట్టు జాతర అని కూడా అంటారు. అయితే, కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం జాతరను నేటి పాలశేర్లయ్య గట్టుకు మార్చారు. సూర్యాపేట జిల్లా పెద్దగట్టు జాతరలో లింగమంతుల స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలి వస్తారు.
శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ జాతర గురించి స్థానికంగా అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. స్థానిక పురాణాల ప్రకారం, రాష్ట్రకూట రాజవంశానికి చెందిన ధ్రువుడు తన పేరు మీద ఇక్కడ ఒక గ్రామాన్ని నిర్మించాడని, అది తరువాత దురాజ్పల్లిగా మారిందని చెబుతారు. కాకతీయుల కాలంలో ఉండ్రు కొండపై శివ కేశవ ఆలయాలు ఉండేవి. ఇక్కడ వార్షిక ఉత్సవాలు చాలా ఘనంగా జరిగేవి. ఈ ఉత్సవాల సమయంలో తన పూజ కోసం కొండపైకి వచ్చిన ఒక గర్భిణీ స్త్రీ జారిపడి మరణించింది. ఈ సంఘటనతో చలించిన ప్రభువు భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి పాలశేర్లయ్య గట్టు పై లింగమంతులస్వామిగా కనిపించాడని స్థానిక ప్రజలు చెబుతారు.
ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే లింగమంతుల జాతర ప్రారంభానికి 15 రోజుల ముందు దిష్టిపూజ ఉత్సవం జరుగుతుంది. మాఘశుద్ధ పాడ్యమి తర్వాత రెండవ ఆదివారం నాడు, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చీకటిపాలెం నుండి దిష్టిపూజ కుంభాన్ని దేవరపేటకు తీసుకువస్తారు. మకర తోరణం, ఇతర ఆభరణాలను సూర్యాపేట నుండి పెద్దగట్టుకు తీసుకువచ్చి అలంకరిస్తారు. ప్రతి ఆదివారం, సోమవారం పూజలు జరుగుతాయి. ఈ జాతర ఐదు రోజుల పాటు కొనసాగుతుంది. యాదవుల వంశ దేవత అయిన చౌడమ్మ ఆలయాలు సూర్యాపేట, దురాజ్పల్లి, పెన్పహాడ్ గ్రామాలలో తప్ప మరెక్కడా కనిపించకపోవడం గమనార్హం. పండుగలో భాగంగా ఒక పొట్టేలును తీసుకువచ్చి, పువ్వులు, పసుపు, కుంకుమలతో పూలమాలలు వేసి దేవుడు దిక్కువైపు వదిలేస్తారు. గొర్రె జడ్తి ఇవ్వగానే మొక్కు తీర్చుకుంటారు. అయితే, లింగమంతుల స్వామి శాఖాహారి కాబట్టి నైవేద్యాలు సమర్పిస్తారు. ఇతర దేవతలకు జంతుబలులు ఇస్తారు. భక్తులు పండుగకు ఒక రోజు ముందు వస్తారు. పురుషులు ఎర్రటి బట్టలు ధరిస్తారు. కాళ్ళకు గజ్జెలు కట్టుకుంటారు. దిలేం బల్లెం శబ్దాల మధ్య నడుస్తారు. “ఓ లింగా.. ఓ లింగా” అని అరుస్తారు. మహిళలు తడి బట్టలు ధరించి, పసుపు, కుంకుమ, పూల దండలు, ధూపం కర్రలతో అలంకరించబడిన మండ గంపను తలపై పెట్టుకుని నడుస్తారు. పిల్లలు లేని స్త్రీలు బోనం కుండను తీసుకు వెళతారు. పిల్లలు లేనివారు స్నానం చేసి తడి దుస్తులతో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తే, భగవంతుని దయతో వారికి పిల్లలు కలుగుతారని నమ్ముతారు.