ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురు కాల్పుల్లో 31 మంది మావోయిస్టులు చనిపోయారు. మావోయిస్టుల ఎదరు కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మరణించారు. మరికొంత మంది జవాన్లకు గాయాలయ్యాయి. గాయపడ్డ జవాన్లను ఆస్పత్రికి తరలించారు. ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి నేషనల్ పార్క్ అడవుల్లో మావోయిస్టుల కోసం పోలీసుల బృందాలు గాలింపు చేపట్టాయి. అటవీప్రాంతాన్ని జల్లెడ పడుతున్న సమయంలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది.
ఈ ఏడాది బీజాపూర్లో ఇప్పటివరకు 56 మంది నక్సలైట్లు చని పోయారు. మొదటి ఎన్కౌంటర్లో ఐదుగురు, రెండవ ఎదురు కాల్పుల్లో 12 మంది, మూడో ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు మరణించారు. ఇప్పుడు జరిగిన ఎన్కౌంటర్లో ఏకంగా 31 మంది మావోయిస్టులు హతమయ్యారు.
కేంద్ర హోంశాఖ లెక్కల ప్రకారం దేశంలో 2004-14 దశాబ్దంతో పోలిస్తే 2014 నుంచి 2023 మధ్య వామపక్ష తీవ్రవాద హింస 52 శాతం తగ్గింది. అలాగే, మరణాల సంఖ్య కూడా 69 శాతం తగ్గింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు ఆపరేషన్లు చేపట్టాలని గత యేడాది కేంద్రమంత్రి అమిత్ షా భద్రతా బలగాలకు నిర్దేశించడంతో శక్తిమంతమైన మావోయిస్టు వ్యతిరేక కమిటీ ఏర్పాటయ్యింది. ఈ కమిటీలో డీజీపీలు, సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ల డైరెక్టర్ జనరల్లు, ఇండో-టిబెటియన్ బార్డర్ పోలీసులు, ఇంటెలిజన్స్ బ్యూరో అధికారులు ఉన్నారు.
ఇప్పుడు జరిగిన భారీ ఎన్కౌంటర్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. ఛత్తీస్గఢ్లోని బీజాపుర్ జిల్లాలో ఆదివారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు మరణించడంపై అమిత్ షా ఎక్స్ లో స్పందించారు. దేశాన్ని నక్సల్స్ రహితంగా మార్చే క్రమంలో భద్రతాదళాలు భారీ విజయాన్ని సాధించాయన్నారు. వచ్చే ఏడాది మార్చినాటికి నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపుతామని తెలిపారు.
‘ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. ఈ ఆపరేషన్లోనే పెద్దఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. నక్సలిజాన్ని అంతం చేసే క్రమంలో ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లనూ కోల్పోయాం.ఆ అమరవీరులకు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది. 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం’ అని అమిత్ షా పేర్కొన్నారు.