జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గం నాయకుడు కిరణ్రాయల్పై భాస్కర న్యూస్లో వెలువడిన కథనానికి జనసేన అధిష్టానం స్పందించింది. కిరణ్ రాయల్ ఓ మహిళను మోసం చేసి కోట్లాది రూపాయలు వసూలు చేశాడని, అన్ని రకాలుగా వాడుకొని ముఖం చాటేశాడని తనకు అత్మహత్యే శరణ్యమంటూ బాధితురాలు రిలీజ్ చేసిన వీడియోపై భాస్కర న్యూస్ మొట్టమొదటగా కథనాన్ని అందించింది. బాధితురాలి వెర్షన్ను ఉన్నది ఉన్నట్లుగా రిపోర్ట్ చేసింది. తన పిల్లలకు సమాధానం చెప్పుకోలేకపోతున్నానని, కిరణ్ రాయల్ వల్ల అప్పుల్లో కూరుకు పోయానని, అప్పుల వాళ్లకు కూడా సమాధానం చెప్పలేక పోతున్నానని బాధితురాలు సెల్పీ వీడియోలో పేర్కొంది. అంతేకాదు.. తనకు ఆత్మహత్య తప్ప గత్యంతరం లేదని, కేవలం కిరణ్ రాయల్ వల్లే చనిపోతున్నానని వీడియోలో వివరించింది.
కిరణ్ రాయల్పై వచ్చిన ఆరోపణలు, బయటకు వచ్చిన వీడియోలు, భాస్కర న్యూస్లో వచ్చిన కథనం నేపథ్యంలో జనసేన కేంద్ర కార్యాలయం స్పందించింది. అంతర్గత విచారణకు ఆదేశించింది. పార్టీ అధ్యక్షుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు పార్టీలో కాన్ఫ్లిక్ట్ కమిటీ కిరణ్రాయల్ ఇష్యూపై విచారణ చేపడుతోంది.
జనసేన పార్టీ అంతర్గత విచారణ పూర్తయ్యేదాకా కిరన్ రాయల్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ఓ ప్రకటన విడుదల చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సమాజానికి ప్రయోజనం లేని విషయాలను పక్కన పెట్టి ప్రజలకు ఉపయోగపడే అంశాలపై దృష్టి సారించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పవన్ కల్యాణ్ సూచించినట్లు హరిప్రసాద్ పేర్కొన్నారు.
అంతేకాదు.. కిరణ్రాయల్ ఆ మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో మరొకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.