మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఇంఫాల్లో గవర్నర్ అజయ్ కుమార్ భల్లాకు అందజేశారు. తొలిసారి 2017లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీరేన్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. రెండోసారి 2022లో ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు.
ముఖ్యమంత్రిగా రాజీనామా చేయడానికి ముందు బీరెన్ సింగ్.. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో బీరేన్ సింగ్ సమావేశమయ్యారు. మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత రెండేండ్లుగా మణిపూర్లోని మీటి, కుకి జాతుల మధ్య హింస కొనసాగుతోంది. దీంతో, రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తింది. అయితే, ఈ పరిణామాలతో బీరెన్సింగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు త్వరలో సిద్ధమవుతోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం పదవికి బీరేన్ సింగ్ రాజీనామా చేయడం గమనార్హం. ఆరుగురు ఎమ్మెల్యేలు గల నేషనల్ పీపుల్స్ పార్టీ నేతలతో కాంగ్రెస్ పార్టీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించనున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా కొందరు అధికార బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి గైర్హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు కూడా తెలుస్తోంది.