తిరుమలలో ఈనెల 12వ తేదీన జరగనున్న శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి వేడుకల ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి శుక్రవారం తిరుమల గోకులం సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలలో జరిగే అతి ముఖ్యమైన తీర్థ ఉత్సవాలలో ఒకటైన రామకృష్ణ తీర్థ ముక్కోటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. యాత్రికుల కోసం రేడియో బ్రాడ్కాస్టింగ్ ద్వారా ప్రకటనలు, డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. అదేవిధంగా టీటీడీ భద్రతాసిబ్బంది, పోలీసుల సమన్వయంతో భద్రతా ఏర్పాట్లు చేయాలని వెంకయ్య చౌదరి సూచించారు. అనంతరం.. అన్నప్రసాదం, తాగునీరు, వైద్యం సదుపాయాలు, అటవీ శాఖల ఏర్పాట్లపైనా అదనపు ఈవో సమీక్షించారు.
అధిక బరువు ఉన్నవాళ్లు, ఆస్తమాతో బాధపడే వాళ్లను, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లను, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న భక్తులను, వృద్ధులను, అలాగే.. పదేళ్లలోపు చిన్నారులను కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు అనుమతించబోమని ఆయన తెలియజేశారు. కాగా, గోగర్భం డ్యామ్ పాయింట్ నుండి పాప వినాశనం వరకు యాత్రికులను తరలించేందుకు ఏపీఎస్ ఆర్టీసీ పెద్ద సంఖ్యలో బస్సులను ఏర్పాటు చేస్తోందన్నారు. ఫిబ్రవరి 12వ తేదీ ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే భక్తులను ఈ తీర్థానికి అనుమతిస్తారని చెప్పారు. ఈ సమావేశంలో ఈఈ సుబ్రహ్మణ్యం, విజిఓ సురేంద్ర, డీఎఫ్ఓ శ్రీనివాసులు, తిరుమల పోలీసు ఉన్నతాధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు