ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే, సమావేశాలపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. బడ్జెట్ ఎప్పుడు ప్రవేశ పెడతారో అనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఈనెల 6వ తేదీ జరిగే మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్ ఎప్పుడు ప్రవేశ పెట్టాలన్నదానిపై నిర్ణయం తీసుకోనుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో ఈసారి బడ్జెట్పై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే బడ్జెట్ రూపొందించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈనెల 24వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ప్రభుత్వం వివిధ శాఖల నుంచి ప్రతిపాదనలు తీసుకుంటోంది.ప్రధానంగా సంక్షేమ పథకాలపై పూర్తిస్థాయి కసరత్తు చేస్తోంది. వీటికి సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు చేయనుంది. అయితే, ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి వివిధ శాఖల నుంచి కీలక ప్రతిపాదనలు కూడా వచ్చాయి. వాటిపై క్యాబినెట్లో చర్చించనున్నారు. అదే సమయంలో కీలక బిల్లులను సైతం సిద్ధం చేస్తున్నారు. ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మూడు వారాలకు పైగా నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో నాలుగైదు రోజులపాటు మాత్రమే బడ్జెట్ సమావేశాలు కొనసాగాయి. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఇలాగే కొనసాగింది. అప్పట్లో విపక్షాలుగా ఉన్న తెలుగుదేశం, జనసేన దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసేవి. ఎక్కువ రోజులు అసెంబ్లీ సెషన్స్ నిర్వహించాలని కోరేవి. అందుకే, ఇప్పుడు అధికారంలోకి రావడంతో వీలైనంత వరకు ఎక్కువ రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోందంటున్నారు. ఈసారి బడ్జెట్పై భారీ అంచనాలు ఉన్నాయి. వార్షిక బడ్జెట్ కావడంతో పూర్తిస్థాయి కేటాయింపులు ఉంటాయని భావిస్తున్నారు. ముఖ్యంగా సంక్షేమ పథకాలకు భారీగా కేటాయింపులు పెంచే ఛాన్స్ కనిపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతోంది. సూపర్ సిక్స్ పథకాల్లో పింఛన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్ తప్ప ఇంకా ఏమీ అమలు చేయలేదు. అన్నదాత సుఖీభవ అమలుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఉగాది నుంచి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ప్రారంభం కానుంది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి తల్లికి వందనం ప్రారంభించేందుకు కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. బడ్జెట్లో కేటాయింపులు చేయడం ద్వారా ఈ పథకాలపై ఒక స్పష్టత ఇవ్వనుంది కూటమి ప్రభుత్వం. బడ్జెట్ కేటాయింపులను బట్టి సంక్షేమ పథకాల అమలుపై ఒక స్పష్టత రానుంది. ఈనేపథ్యంలోనే బడ్జెట్ రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. ఇప్పటికే అన్ని శాఖల నుంచి అవసరమైన ప్రతిపాదనలు కోరారు. అదే సమయంలో పెండింగ్ బిల్లులు, ఇతరత్రా కేటాయింపులపై కూడా కసరత్తు చేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ కావడంతో.. భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే వాటిని అందుకునేందుకు వీలుగా.. బడ్జెట్ రూపకల్పన చేస్తున్నట్లు తెలుస్తోంది.
- Advertisement with us -