35.9 C
Hyderabad
Thursday, June 4, 2026

Live Video

spot_img

పట్టభద్రుల ఎన్నికల్లో వలంటీర్లు – కూటమి సర్కారుకు ఝలక్‌

ఆంధ్రప్రదేశ్‌లో పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. రెండు స్థానాలకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోల్స్ జరగబోతున్నాయి. ఈ నెల 27వ తేదీన జరిగే ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. అయితే, గత ఎన్నికల్లో రికార్డు మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీలు..ఈ రెండు స్థానాలపై గురిపెట్టాయి.ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి వారి గెలుపు బాధ్యతను ఆయా జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు అప్పగించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, నేతల వలసలతో డీలా పడిపోయిన వైసీపీ ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని డిసైడ్ అయింది. దీంతో, వార్ వన్‌ సైడ్‌ అన్నట్లుగా ఉంటుందని భావించిన కూటమికి.. వాలంటీర్ల రూపంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. కూటమి పార్టీల అభ్యర్థులపై పోటీకి వాలంటీర్లు సై అంటుండటం ఆసక్తి రేపుతోంది. కృష్ణ-గుంటూరు, గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక వేడెక్కుతోంది. ప్రతిపక్షం వైసీపీ పోటీకి దూరంగా ఉండిపోవడంతో గెలుపు నల్లేరు మీద నడకే అని భావించాయి కూటమి పార్టీలు. అనూహ్యంగా పోటీకి సై అంటూ వాలంటీర్లు దూసుకు వచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమకిచ్చిన మాట తప్పారంటూ కూటమి అభ్యర్థులను దెబ్బతీయాలని భావిస్తున్నారట వాలంటీర్లు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా తమలో ఒకరిని పోటీకి నిలబెట్టాలని నిర్ణయించారు. విజయవాడలో జరిగిన సమావేశంలో గోదావరి జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీగా వాలంటీర్ వానపల్లి శివగణేశ్, కృష్ణ-గుంటూరు నుంచి వాలంటీర్ లంక గోవింద రోజులు పోటీకి దిగనున్నారు. గత ప్రభుత్వంలో సేవలు అందించిన వాలంటీర్లను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పక్కన పెట్టింది. అయితే పలుసార్లు విజ్ఞప్తి చేసినా.. నిరసన తెలిపినా వారిని విధుల్లోకి తీసుకోలేదు. దీంతో ఎమ్మెల్సీగా పోటీ చేసి తమ సత్తా చాటాలని వాలంటీర్లు భావిస్తున్నారు.గత ఎన్నికల్లో వైసీపీ ఓటమికి వాలంటీర్లే కారణమనే అభిప్రాయం ఉంది. క్యాడర్‌, లీడర్లను పట్టించుకోకుండా వాలంటీర్లకు పెద్దరికం ఇవ్వడం వల్లే కార్యకర్తలు అసంతృప్తికి లోనయ్యారన్నది కాదనలేని వాస్తవం. వైసీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో ఇదీ ఒకటనేది పొలిటిక్స్‌ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్న మాట. అయితే వాలంటీర్లు మాత్రం ఐదేళ్లపాటు ప్రజలకు సేవలందించి మంచి పేరు తెచ్చుకున్నామని, కూటమి ప్రభుత్వం తమను మోసం చేసిందని ప్రచారం చేస్తున్నారు.కూటమి గెలిస్తే వాలంటీర్ల వేతనాలను రూ.10 వేలు చేస్తామని చెప్పారని, విద్యార్హతకు తగినట్లు ఇతర ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చాక మాట మార్చి వాలంటీర్లు విధుల్లోనే లేరని తప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను మోసగించిన ప్రభుత్వానికి ఎమ్మెల్సీ ఎన్నికలను అస్త్రంగా వాడుకుని నిరసన తెలియజేస్తామంటున్నారు.ఒక్కో ఎమ్మెల్సీ స్థానంలో దాదాపు 3 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఒక్కోచోట దాదాపు లక్షన్నర ఓటర్లను చేర్పించారు. ఈ పరిస్థితుల్లో కూటమి పార్టీల అభ్యర్థుల విజయంపై నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే అనూహ్యంగా వాలంటీర్లు రంగంలోకి దిగడం, వారికి ఓటర్లతో నేరుగా సంబంధాలు ఉండటంతో ఎంతటి ప్రభావం చూపుతారనే చర్చ జరుగుతోంది. వాలంటీర్లు విజయం సాధించే అవకాశాలు లేకపోయినా వారికి దక్కే ఓట్లు ప్రభుత్వ వ్యతిరేకతను తెలియజేసే చాన్స్ ఉందంటున్నారు. దీంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరు ఉత్కంఠ రేపుతోంది. గ్రాడ్యుయేట్‌ పోల్స్‌లో వాలంటీర్ల ప్రభావం ఎంతుంటుందో చూడాలి మరి..

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com