తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్బాబు బీజేపీ సభ్యులను ఓ ఆట ఆడుకున్నారు. కాంగ్రెస్పార్టీ సంస్కృతి, బీజేపీ అనుభవాలను గుర్తు చేశారు. ఆదినుంచీ బీసీలకు అండగా ఉంటున్నది కాంగ్రెస్పార్టీ మాత్రమే అని స్పష్టం చేశారు. బీసీ నాయకులకు సంబంధించి గతంలో బీజేపీ చేసిన పరిణామాలను అసెంబ్లీలో ప్రస్తావించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ బిడ్డ బండి సంజయ్ ను తొలగించింది కాంగ్రెస్ పార్టీ కాదంటూ మంత్రి శ్రీధర్ బాబు ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రి వర్గం నుంచి బలహీన వర్గాలకు చెందిన బండారు దత్తాత్రేయ ను భర్తరఫ్ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ కాదన్నారు. మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణనపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ చేసిన నిరాధార ఆరోపణలపై ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఒక్కసారి చరిత్ర తిరిగేయాలని, బలహీన వర్గాలకు అన్ని రంగాల్లో పెద్ద పీట వేసింది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ మార్గ నిర్దేశనంలో ఆయన ఆలోచనలకు అనుగుణంగా బీసీలకు మేలు చేయాలనే సంకల్పంతోనే ఈ సర్వేను నిర్వహించామన్నారు. ఒక బీసీ బిడ్డగా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని అభినందించించాల్సింది పోయి ప్రభుత్వాన్ని విమర్శించడం సరి కాదన్నారు. మీ పార్టీ నాయకుల మాదిరిగా బీసీ బిడ్డలు ఉన్నత స్థానంలో ఉంటే ఓర్వలేని తత్వం తమది కాదన్నారు. ఒక బీసీ బిడ్డగా మీరు రాజకీయాల్లో ఉన్నత స్థానానికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి వాస్తవాలను తెలుసుకోవాలని హితవు పలికారు