వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొట్టిన సంఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. దీంతో, ఉమ్మడి జిల్లాలో తీవ్ర విషాదం అలుముకుంది. రిపబ్లిక్ దినోత్సవం నాడు దేశమంతా పండుగ జరుపుకుంటూంటే ఏడుగురు మరణించడం, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడటం అందరినీ కలచివేసింది.
వరంగల్ శివారులోని మామునూరు భారత్ పెట్రోల్పంప్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. రైలు పట్టాల లోడ్తో వెళ్తున్న లారీ.. ఓ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి సహా ఏడుగురు దుర్మరణం పాలయ్యారు.
అదుపుతప్పిన లారీ ఆటోను ఢీకొట్టిన వెంటనే లారీలో ఉన్న రైలు పట్టాలు ఆటోపై పడిపోయాయి. దీంతో ప్రమాద తీవ్రత పెరిగింది. రైలుపట్టాల కింద పలువురు ఇరుక్కుపోయారు. ఈ సంఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లారు. రైలు పట్టాల కింద ఇరుక్కున్న నలుగురిని బయటకు తీశారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
లారీ ఖమ్మం నుం చి వరంగల్ వైపునకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. రోడ్డుపై పడ్డ రైలు పట్టాలను జేసీబీ సాయంతో పక్కకు తొలగించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై రోడ్డుకు ఇరువైపులా దాదాపు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే, ప్రమాద తీవ్రత కారణంగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.