సరస్వతి పుష్కరాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ నుంచి కాళేశ్వరానికి ప్రత్యేక బస్సులు నడపాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, కూకట్పల్లి, జీడిమెట్ల, మేడ్చల్ వంటి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల నుంచి మెట్రో డీలక్స్ బస్సులు నడవనున్నాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులు ప్రధాన ఘాట్లకు సులభంగా చేరేలా ప్రణాళిక రూపొందించారు. ఒకే కాలనీలో 40 మంది ప్రయాణికులు పుష్కరాలకు వెళ్లాలనుకుంటే, ఆ కాలనీకే ప్రత్యేక బస్సు పంపించేలా ఏర్పాట్లు చేశారు. భక్తులు ముందస్తుగా బస్సుల కోసం [http://tgsrtcbus.in](http://tgsrtcbus.in) వెబ్సైట్ ద్వారా టికెట్లు రిజర్వ్ చేసుకోవచ్చు లేదా 9676671533, 9959226154, 9959226160 నెంబర్లను సంప్రదించవచ్చు. పన్నెండేళ్లకోసారి జరిగే ఈ పవిత్ర పుష్కరాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 790 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడవనున్నాయి. భక్తులు సురక్షితంగా, ఎలాంటి అసౌకర్యం లేకుండా పుష్కర స్నానం ఆచరించేలా అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి.
భద్రతా పరంగా కూడా పోలీస్ శాఖ తగిన చర్యలు తీసుకుంది. మూడు షిఫ్టుల్లో మొత్తం 3,500 మంది పోలీసుల్ని విధుల్లో పెట్టారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రతను కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు అవసరమైన సూచనలు ఇప్పటికే జారీ చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఘాటులో మే 15 నుంచి 26 వరకు సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. మే 15న ఉదయం 5 గంటల 44 నిమిషాలకు శ్రీ గురుమదనానంద సరస్వతి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి ఘనంగా పుష్కరాలు ప్రారంభిస్తారు. అదే రోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కాళేశ్వరం చేరుకొని పుష్కర స్నానం ఆచరించి ఆలయ దర్శనం చేయనున్నారు. అనంతరం సరస్వతీ మాత విగ్రహావిష్కరణ, గోదావరి హారతి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.