ఇకపై ఏటా రెండు విడతలుగా పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని సీబీఎస్ఈ ప్రతిపాదించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే.. అంటే 2026 నుంచి ఈ ప్రతిపాదనను అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన విధి విధానాలను తన వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. ఈ ప్రతిపాదనలు, విధి విధానాలపై ఎవరికైనా అభ్యంతరాలు, సూచనలు ఉంటే.. మార్చి 9వ తేదీలోగా అభిప్రాయాలు చెప్పాలని కోరింది. ఫిబ్రవరి 17వ తేదీ నుంచి మార్చి 6వ తేదీ వరకు తొలి విడతగా, మే 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రెండో విడతగా పరీక్షలు నిర్వహిస్తామని ముసాయిదాలో పేర్కొంది. ఇంప్రూవ్మెంట్ కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ రెండు విడతల్లోనూ పరీక్షలు రాసే అవకాశం ఉందని సీబీఎస్ఈ పేర్కొంది. అయితే, ఇంప్రూవ్మెంట్ కోసం కొన్ని సబ్జెక్టులను మాత్రమే ఎంచుకునే సౌలభ్యం ఉందని పేర్కొంది రెండు విడతల్లోనూ మొత్తం సిలబస్కు పరీక్షలు నిర్వహిస్తారు. రెండు విడతలకు కూడా ఒకే పరీక్ష కేంద్రాన్ని కేటాయిస్తారు. ఎలాంటి మార్పులు చేయబోరు. 2026 ఫిబ్రవరిలో పరీక్షలు రాసే విద్యార్థుల జాబితాను 2025 సెప్టెంబరు నాటికే తయారు చేస్తారు. ఈ జాబితాలో పేరు ఉన్నవారికి మాత్రమే 2026 మేలో జరిగే పరీక్షలకు అనుమతి ఇస్తారు. ఒక్కసారి జాబితాను ఖరారు చేసిన తరువాత సబ్జెక్టులను మార్చుకునే అవకాశం విద్యార్థులకు ఉండదు.