అమెరికాలో విద్యార్థులకు డిపోర్టేషన్ ముప్పు వచ్చి పడింది. చదువు పేరుతో వెళ్లి ఉద్యోగం చేసేవారిపై నిఘా పెట్టి పట్టుకుంటున్న అధికారులు పట్టుబడ్డ వారిని స్వదేశానికి పంపుతన్నారు. వారం రోజులుగా పార్ట్ టైం జాబ్లకు డుమ్మా కొట్టడంతో అక్కడి భారతీయ వ్యాపారులపైన ఈ ప్రభావం పడింది. అమెరికాలోని మిషిగన్ స్టేట్లో.. ఓ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్న ఇద్దరు విద్యార్థులను ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) అధికారులు 21వ తేదీ రాత్రి పట్టుకున్నారు. ఆ విద్యార్థులు నిబంధనలకు విరుద్ధంగా క్యాంపస్ బయట అనధికారికంగా పనులు చేస్తుండడమే ఇందుకు కారణం. క్యాంపస్ నుంచి వారు ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చేస్తున్నారన్న దానిపై మూడు రోజులపాటు నిఘా పెట్టి మరీ పట్టుకున్నారు. అనంతరం వారి సెవిస్ (విద్యార్థికి అమెరికాలో ఇచ్చే గుర్తింపు సంఖ్య)ను రద్దు చేశారు. ఆపై ఫిబ్రవరి 15లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. దీంతో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి.. ఖర్చుల కోసం పార్ట్ టైం జాబ్ చేస్తున్న ఈ విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. మిషిగన్లోనే కాదు అమెరికా వ్యాప్తంగా ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ పార్ట్ టైం ఉద్యోగాలు చేసే విద్యార్థులందరిలోనూ ఆందోళన మొదలైంది. అమెర్వీకన్రి అధికారుల తీరుతో అమెరికాలో విద్పయార్నిథులతో పార్ట్ టైం ఉద్యోగాలు చేయించుకుంటున్న భారత్కు చెందిన వ్యాపారవేత్తల పరిస్థితి కూడా ఇబ్బందికరంగా మారింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తిరిగి ఎన్నికయ్యాక తీసుకుంటున్న నిర్ణయాలే ఇందుకు కారణం. ట్రంప్ బాధ్యతలు చేపట్టగానే అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఇది, అమెరికాలో అధిక సంఖ్యలో ఉన్న భారతీయుల్లో, తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిలో గుబులు రేపుతోంది. ముఖ్యంగా ఉన్నత చదువుల కోసం ఎఫ్-1 వీసాపై అక్కడ ఉంటూ నిబంధనలకు విరుద్ధంగా పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటున్నవారు, మాస్టర్స్ పూర్తి చేసి.. ఓపీటీ లో ఉన్నవారి పరిస్థితి ఎటూ తోచకుండా ఉంది. ఎఫ్-1 వీసాదారుల్లో ఆందోళన .. కొత్తగా అమెరికా వెళ్ళే వారిని సైతం కలవరపెడుతోంది. ఇదిలా ఉంటే ఉన్నత చదువుల కోసం తమ దేశానికి వచ్చేవారికి అమెరికా ప్రతి ఏటా దాదాపు 2లక్షల ఎఫ్-1 వీసాలు జారీ చేస్తోంది.