బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఈమేరకు ఉదయమే ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. పలువురు కీలక నేతలతో వివిధ అంశాలపై ప్రత్యేకంగా చర్చిస్తున్నారు. అయితే, సాయంత్రం తెలంగాణ బీజేపీ నేతలతో సమీక్షా సమావేశం జరుగుతుంది. ఆ సమావేశానికి ముందే పలువురు ముఖ్య నేతలతో ముఖాముఖి భేటీ నిర్వహిస్తున్నారు.
బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఇంకా ఎటూ తేలడం లేదు. రేపు, మాపు అంటూ సమయం గడిచి పోతోంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే దానిపై స్థానిక నేతల అభిప్రాయాలు భిన్నంగా ఉంటున్నాయి. నూతన అధ్యక్షుడి రేసులో ఎంపీలు ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అధిష్ఠానం సునీల్ బన్సల్ను రాష్ట్రానికి పంపించిందన్న టాక్ నడుస్తోంది.
మరోవైపు.. తెలంగాణ బీజేపీ నేతలతో సునీల్ బన్సల్ కీలక సమీక్షలు నిర్వహించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను విశ్లేషించడంతో పాటు.. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. మరోవైపు.. వాజ్పేయి శతజయంతి ఉత్సవాలపై బన్సల్ సమీక్షించనున్నారు. వీటితో పాటు.. వన్ నేషన్-వన్ ఎలక్షన్పై బీజేపీ రాష్ట్రస్థాయి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.