పొరుగువారిని ప్రేమించాలని చెప్పిన యేసుక్రీస్తు బోధనలు విశ్వమానవాళికి మార్గదర్శకమని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. విశ్వమానవులకు ప్రేమ, సౌభ్రాతృత్వం పంచిన ఏసుక్రీస్తు మార్గం ప్రతి ఒక్కరికీ అనుసరణీయమన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులకు భట్టి విక్రమార్క శుభాకాంక్షలు తెలిపారు. అన్ని మతాల సారాంశం మానవత్వమేనని యేసుక్రీస్తు ఎంచుకున్న మార్గం అందరికీ దిక్సూచిగా నిలుస్తోందన్నారు. శాంతి సహనం కరుణ ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని బోధించిన జీసస్ మాటలు సదా అనుసరించాల్సిన మార్గమని ఉప ముఖ్యమంత్రి గుర్తు చేశారు. యేసుక్రీస్తు నేర్పిన మార్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం సర్వమత హితంగా పరిపాలన చేస్తుందన్నారు. అన్ని మతాల ప్రజల అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం స్థిర సంకల్పంతో కట్టుబడి పని చేస్తుందని హామీ ఇచ్చారు. క్రిస్టియన్ మైనారిటీల సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని భట్టి భరోసా ఇచ్చారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులు ఆనందంగా వేడుకగా ఈ పండుగను జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు భట్టివిక్రమార్క వెల్లడించారు.