హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 20 టీఎంసీల గోదావరి జలాలు తరలించడంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ ప్రాజెక్టుల నుంచి నీటి తరలింపుపై సమగ్ర నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో జలమండలి, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏ ప్రాజెక్టు నుంచి నీటి తరలింపునకు ఎంత వ్యయం అవుతుందన్న అంశంతో పాటు.. నీటి లభ్యత పైనా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. అన్నీ పూర్తయి వచ్చెనెల 1వ తేదీన టెండర్లకు వెళ్లేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఈ సమీక్షలో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ సెక్రటరీ ప్రశాంత్ జె. పాటిల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.