గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హౌసింగ్ సొసైటీలకు భూ కేటాయింపులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. జీహెచ్ఎంసీ పరిధిలో హౌసింగ్ సొసైటీలకు కేటాయించిన భూ కేటాయింపులను రద్దు చేసింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్ సంజీవ్ కన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజు(సోమవారం) తీర్పు వెలువరించింది. ప్రజా ప్రతినిధులు, అధికారులు, జర్నలిస్టు సొసైటీలకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వివిధ సమయాల్లో ప్రభుత్వాలు భూములు కేటాయించాయి.
ప్రభుత్వాలు భూ కేటాయింపులు చేయడాన్ని సవాల్ చేస్తూ రావు బీ చెలికాని సుప్రీకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై దేశ అత్యున్నత న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది. జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో సభ్యులకు మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్ల స్థలాలు కేటాయించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 8న హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఇండ్ల స్థలాల కేటాయింపు పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి అందించారు. సుప్రీంకోర్టు ధర్మాసనం తాజా తీర్పు నేపథ్యంలో హౌసింగ్ సొసైటీలకు కేటాయించిన భూములపై సందిగ్ధం నెలకొన్నది.