28 C
Hyderabad
Tuesday, March 10, 2026

Live Video

spot_img

షాహీ జమా మసీదు సర్వే ఎందుకు వివాదాస్పదమైంది ?

ఉత్తరప్రదేశ్ లోని సంభల్ లో షాహీ జమా మసీదులో కోర్టు ఉత్తర్వులతో ఆదివారం సర్వే చేస్తుండగా హింసాత్మక ఘటనలు చెలరేగి నలుగురు మరణించారు. 20 మంది పోలీసులు సహా పలువురు గాయపడ్డారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గుంపుగా వచ్చి సర్వేను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. మసీదు ముందున్న వాహనాలకు నిప్పు పెట్టారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పట్టణంలో సోమవారం స్కూళ్లు మూసివేశారు. ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. బీజేపీ, సమాజ్ వాదీ పార్టీ అల్లర్లకు కారణం మీరంటే మీరేనని బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేశారు. ఈ షాహీ జమా మసీదుపై చాలా కాలంగా వివాదం కొనసాగుతోంది. 1528 సంవత్సరంలో ఈ మసీదుని నిర్మించడానికి ముందు అక్కడ శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీహరిహర కల్కి దేవాలయం ఉండేదన్న వాదనలు ఉన్నాయి. జమా మసీదు కమిటీ బలవంతంగా ఈ ఆలయాన్ని కూల్చేసి మసీదు కట్టారని స్థానిక కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లు వేసిన వారిలో వారణాసిలో జ్ఞానవాపి మసీదు కేసుని వాదిస్తున్న అడ్వకేట్ హరిశంకర్ జైన్ ఉన్నారు. జమా మసీదులో సర్వే నిర్వహించి నిజానిజాలు తేల్చాలంటూ మొత్తం ఎనిమిది పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను విచారించిన స్థానిక కోర్టు సర్వే నిర్వహించి ఈ నెల 29 లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
కల్కి అవతారం ఇక్కడేనా ?
సంభల్ ప్రాంతాన్ని చారిత్రకంగా హిందువులు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. హిందూ పురాణాలు, శాస్త్రాల్లో కూడా శంభాల ప్రస్తావన ఉంది. కలియుగాంతంలో విష్ణమూర్తి ఆఖరి అవతారమైన కల్కి భగవానుడు ఈ ప్రాంతంలోనే జన్మిస్తాడని, అప్పట్నుంచి సత్య యుగం మొదలవుతుందని హిందువుల నమ్మకం. పురాాణాల్లో పేర్కొన్న శంభాలే ఉత్తరప్రదేశ్ లో ఉన్న సంభల్ అని హిందువుల నమ్మకం. శివకేశవులిద్దరూ ఒక్కటిగా ఉండే ఒక అరుదైన విగ్రహం సంభల్ హరిహర కల్కి దేవాలయంలో ఉండేదని శాసనాల ద్వారా కూడా తెలుస్తోంది. 1526 సంవత్సరంలో మొఘల్ చక్రవర్తి బాబర్ దండయాత్ర చేసి ఎన్నో హిందూ ఆలయాల్ని కూలగొట్టారు. బాబర్ కి చెందిన సైన్యం ఈ సంభల్ మీద కూడా దాడి చేసి 1527-28 ప్రాంతంలో హరిహర దేవాలయాన్ని ధ్వంసం చేశారని, ఆ తర్వాత అక్కడే ఇప్పుడున్న జమా మసీదుని కట్టారని హిందూ సంఘాల వాదనగా ఉంది. పురావస్తు కట్టడాల పరిరక్షణ చట్టం, 1904 ప్రకారం ప్రస్తుతం ఈ జమా మసీదు పరిరక్షించే పురాతన కట్టడాల జాబితాలో చేర్చారు. ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ వెబ్ సైట్ ప్రకారం 1920 సంవత్సరం డిసెంబర్ 22న పరిరక్షించే పురాతన కట్టడాల జాబితాలో చేరుస్తూ నోటిఫై చేశారు. దీంతో వందల ఏళ్లుగా ఇక్కడ ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు బయటవాళ్లు వచ్చిన సర్వే ఎలా చేస్తారని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. మరోవైపు ఇక్కడే ఆలయం ఉండేదని వాదిస్తున్న హిందువులు Ancient Monuments and Archaeological Sites and Remains Act, (AMASR) 1958, సెక్షన్ 18 ప్రకారం ఆ మసీదు కింద ఏముందో అనుమానాలు ఉన్నప్పడు ఎవరైనా వెళ్లే హక్కు ఉంటుందని, కోర్టు ఆదేశాల మేరకే సర్వే జరుగుతోందని వాదిస్తున్నారు. పురావస్తు శాఖ దీనిపై చాలాఏళ్లుగా మౌనంగా ఉంటూ ముస్లింలకు కొమ్ముకాసేలా వ్యవహరిస్తోందని పిటిషనర్ హరిశంకర్ జైన్ ఆరోపించారు. ఈ వివాదంపై సమాజ్ వాదీ పార్టీ సంభల్ ఎంపీ జియా ఉర్ రెహ్మాన్ బర్క్ మాట్లాడుతూ ఈ ప్రాంతంతో సంబంధం లేని బయటవాళ్లు కోర్టుకెక్కి సమస్యని పెద్దది చేస్తున్నారని అన్నారు. 1991 Worship Act ప్రకారం మన దేశానికి స్వాతంత్రం వచ్చే సమయానికి మతపరమైన కట్టడాలు ఎలా ఉన్నాయో అలాగే ఉంచాలని, వాటి చుట్టూ వివాదం చేయకూడదని అంటున్నారు. స్థానిక కోర్టులో న్యాయం జరగకపోతే హైకోర్టుకి వెళతామని ఎంపీ హెచ్చరించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com