తెలంగాణ ప్రభుత్వం పదో తరగతి పరీక్షల విధానంలో భారీ మార్పులు చేసింది. ఇన్నాళ్లుగా కొనసాగుతున్న గ్రేడింగ్ విధానాన్ని ఎత్తేసింది. పరీక్షల్లో ఇకనుంచి వంద మార్కులకు ప్రశ్నా పత్రం అందించనుంది. దీంతో వార్షిక పరీక్షల్లో 80 మార్కుల విధానానికి ఫుల్స్టాప్ పడింది.అయితే, ప్రభుత్వం ఉన్నట్టుండి ఒక్కసారిగా ఈ నిర్ణయం తీసుకోవడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. కనీసం ఈ దిశగా సంకేతాలు కూడా లేకుండా ఏకంగా జీవో జారీచేయడంపై విద్యావేత్తలు విస్తుపోతున్నారు.
తెలంగాణలో ఎస్సెస్సీ పరీక్షల్లో కొన్నేళ్లుగా 80 మార్కుల విధానం కొనసాగుతోంది. ఇంతకు ముందు వరకు వార్షిక పరీక్షల్లో 80 మార్కులకు పేపర్ ఇచ్చేవాళ్లు. మార్కులు లెక్కించే విధానంలో రాత పరీక్షకు 80 మార్కులు, ఇంటర్నెల్ మూల్యాంకనానికి 20 మార్కులు ఉండేవి.అయితే ఇప్పుడు విద్యాశాఖ ఇంటర్నల్ మార్కుల విధానం తొలగించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి మొత్తం వంద మార్కులకు ప్రశ్నాపత్రాన్ని రూపొందించనుంది.దీంతో, మొదట్లో మాదిరిగా పదో తరగతిలో 100 మార్కుల విధానం అమలులోకి వచ్చినట్లయ్యింది.
మార్కులు లెక్కించే ప్రక్రియ సులభంగా ఉండేందుకు, స్కూళ్లలో స్థిరమైన మూల్యాంకన విధానాన్ని రూపొందించడానికి ఈ మార్పు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. కొత్తగా సవరించిన విధానం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చేలా ప్రణాళిక రూపొందించారు. అయితే, ఈ నిర్ణయంపై విద్యావేత్తలు, తల్లిదండ్రులనుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరేమో దీనిని ఎక్కువ ట్రాన్స్పరెంట్ అంటూ సానుకూలంగా స్పందిస్తున్నారు. మరికొందరేమో ఈ నిర్ణయంపై నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. అయితే, అప్డేట్ చేసిన సిలబస్, పరీక్షల షెడ్యూల్ గురించిన పూర్తి వివరాలను విద్యా శాఖ త్వరలోనే విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.
అదే విధంగా.. ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా అమలు చేస్తున్న గ్రేడింగ్ విధానం కూడా రద్దు కానుంది. విద్యార్థుల మార్కుల ఫలితాలను మూల్యాంకనం చేయడానికి గ్రేడింగ్ విధానం ఇప్పుడు అమలు చేస్తున్నారు. వంద మార్కుల ప్రశ్నాపత్రం సిస్టం అమలులోకి వచ్చాక ఈ గ్రేడింగ్ విధానం కూడా రద్దు కానుంది. ప్రస్తుతం విద్యార్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడింగ్ కేటాయిస్తున్నారు. ఒక సబ్జెక్టులో 90శాతానికి పైగా మార్కులు వస్తే ఏ1 గ్రేడ్ తో పాటు టెన్ జీపీఏ.. 81–90 మార్కులకు పైగా వస్తే ఏ2 గ్రేడ్.. 9 జీపీఏ, 71–80 మార్కులు వస్తే బీ 1 గ్రేడ్ తో పాటు 8 జీపీఏ… ఇలా పలు గ్రేడ్లను అలాట్ చేసే వారు. దీనివల్ల స్టూడెంట్లకు ఎన్ని మార్కులు వచ్చాయనేది తెలిసేది కాదు. అయితే, ఈ విద్యాసంవత్సరం నుంచి ఈ గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేసి.. తిరిగి మార్కుల విధానాన్నే అమలు చేయనున్నారు. ఇక నుంచి స్టూడెంట్లకు వచ్చిన మార్కులను నేరుగా ప్రకటించనున్నారు. ఇంటర్నల్ మూల్యాంకనాల్లో 20మార్కుల వ్యవహారంలో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరణ ఇస్తున్నారు.
ప్రస్తుతం ప్రభుత్వం చేయబోతున్న మార్పుల్లో భాగంగా క్వశ్చన్ పేపర్ విధానంతో పాటు ఆన్సర్ విధానంలోనూ ప్రభుత్వం మార్పులు చేసింది. ఇప్పటి వరకూ ఎగ్జామినేషన్ సెంటర్లలో ఒక్కో విద్యార్థికి ముందుగా నాలుగు పేజీల బుక్ లెట్ ఇచ్చి.. ఆ తర్వాత విద్యార్థికి అవసరమైనన్ని 4 పేజీల అడిషనల్ ఆన్సర్ షీట్లను ఇస్తున్నారు. దీంతో, స్టూడెంట్లు వాటిని జతచేయడంలో ఇబ్బందులతో పాటు కొన్ని సందర్భాల్లో ఆన్సర్ షీట్లూ మిస్ అవుతున్నాయన్న ఆరోపణలున్నాయి. దీంతో, ఈ నాలుగు పేజీల ఆన్సర్ షీట్ విధానానికి కూడా ఇకపై ఫుల్స్టాప్ పడనుంది. ఇక నుంచి పరీక్షల్లో విద్యార్థులకు 24 పేజీల ఆన్సర్ బుక్ లెట్లు అందిస్తారు. ఇక అడిషనల్ పేపర్లు ఇవ్వరు. అయితే, సైన్స్ పేపర్లు రెండు ఉండటంతో ఒక్కో పేపర్కు 12 పేజీల ఆన్సర్ బుక్ లెట్ అందిస్తారు.
తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు తేదీల్లో కూడా మార్పులు చేశారు. విద్యార్థులు ఎలాంటి లేట్ ఫీజు లేకుండా నవంబర్ 18వ తేదీ వరకు చెల్లించవచ్చని గతంలో ప్రకటించగా.. ఇప్పుడు ఈ గడువును నవంబర్ 28వ తేదీ వరకు పొడిగించింది. ఆ తర్వాత రూ.50 ఆలస్యపు ఫీజుతో డిసెంబర్ 12వ తేదీ వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. అదే విధంగా రూ. 200 ఆలస్య ఫీజుతో డిసెంబర్ 12వ తేదీ వరకు, రూ. 200 ఆలస్య ఫీజుతో డిసెంబర్ 19వ తేదీ వరకు.. రూ.500 ఆలస్య ఫీజుతో డిసెంబర్ 30 వరకు అవకాశం కల్పించారు.