ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా నిరాడంబర జీవనం గడిపే ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఏళ్లు గడుస్తున్నా అదే ఒరవడి సాగిస్తున్నారు. సైకిల్పై వెళ్లడం, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం వంటివి ఆయన విషయంలో సర్వసాధారణంగా కనిపిస్తాయి.
ఇదే క్రమంలో బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి కంటి పరీక్షల కోసం ఆయన వచ్చారు. అక్కడ అందరితోపాటే ఓపీ చీటి తీసుకుని వైద్యుల గది ముందు క్యూలో వేచి ఉండి తన వంతు వచ్చాక పరీక్ష చేయించుకున్నారు. నేడు వార్డుమెంబర్, సర్పంచ్, ఎంపీటీసీలే హంగూ ఆర్భాటాలతో జీవిస్తుండగా 25ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగిన గుమ్మడి నర్సయ్య… ఆదర్శంగా వ్యవహరించడాన్ని పలువురు అభినందించారు. వర్తమాన రాజకీయ నాయకుల్లో గుమ్మడి జీవన శైలి స్పూర్తి దాయకమని అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.