రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండురోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. హైదరాబాద్లో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి రానున్న రాష్ట్రపతి ముర్ముకు గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు స్వాగతం పలకనున్నారు.
ఈరోజు(గురువారం) సాయంత్రం 6.20 గంటల నుంచి 7.10 గంటల వరకు రాజ్ భవన్ లో రాష్ట్రపతి విశ్రాంతి తీసుకుంటారు. ఈ రోజు రాత్రి 7.20 గంటలకు ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవంలో రాష్ట్రపతి పాల్గొంటారు.
అనంతరం రాజభవన్లో రాష్ట్రపతి రాత్రి బస చేస్తారు. రేపు(శుక్రవారం) ఉదయం10.30 కి హై టెక్ సిటీ శిల్పకళా వేదిక లో జరిగే లోక్ మంథన్ 2024 కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము పాల్గొంటారు. శుక్రవారం మధ్యాహ్నం 12.05 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తిరుగుపయనమవుతారు.
ఈ నేపథ్యంలో నగరంలో రెండురోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. గురువారం సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పంజాగుట్ట జంక్షన్, గ్రీన్ల్యాండ్ జంక్షన్, బేగంపేట్ ఫ్లైఓవర్, శ్యాంలాల్ బిల్డింగ్, పీపీఎన్టీ ఫ్లైఓవర్, హెచ్పీఎస్ అవుట్గేట్, ఎయిర్పోర్టు వై జంక్షన్, మోనప్ప జంక్షన్, యశోద హాస్పిటల్, కత్రియ హోటల్, మెట్రో రెసిడెన్సీ, పీవీ విగ్రహం, రాజ్ భవన్ రోడ్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, నెక్లెస్ రోడ్డు, తెలుగు తల్లి జంక్షన్తో పాటు ఫ్లైఓవర్పై ఆంక్షలు ఉంటాయి. ఎన్టీఆర్ మార్గ్, కట్టమైసమ్మ, ఇక్బాల్ మినార్, ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం జంక్షన్, అశోక్నగర్ జంక్షన్, ఎన్టీఆర్ స్టేడియం ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు.
శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాదాపూర్, రాయదుర్గం, కొత్తగూడ, గచ్చిబౌలి, కొండాపూర్ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. వాహనదారులు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాల్సి ఉంటుంది.