ఆంధ్రప్రదేశ్ను చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు అప్పుల ఊబిలోకి నెట్టేస్తోందని మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆక్షేపించారు. రాస్ట్రంలో ఇప్పుడంతా లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియాదే రాజ్యమన్నారు. బుడమేరు ముంచెత్తడానికి కారణం కూటమి నేతలు కాదా? అని ఆయన ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు నాయుడు పులివెందుల సభలో సంపద సృష్టిస్తానని ప్రగల్భాలు పలికారని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాత్రం సర్కారు ఖజానాలో డబ్బులు లేవంటూ మాట్లాడతారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం 67వేల కోట్ల రూపాయలు అప్పు చేసిందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు సార్లు కరెంట్ బిల్లులు పెంచి ప్రజలపై 67వేల కోట్లు భారం మోపారని సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తంచేశారు. సోలార్ పవర్ 2400 మెగావాట్స్ వైఎస్సార్సీపీ హయాంలో 2.49 రూపాయలకు కొంటే, టీడీపీ హయాంలో 5.90 రూపాయలకు కొన్నారని.. చంద్రబాబు ప్రభుత్వం హయంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. ఉచిత ఇసుక పేరుతో 750 కోట్లు ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారని విమర్శించారు.
అమరావతికి కొత్త కళ అంటూ.. 2014 నుంచి కూడా చంద్రబాబు గ్రాఫిక్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు కొట్టుసత్యనారాయణ. బుడమేరు మునగడానికి కారణం మీరు కాదా అని ప్రశ్నించారు. బుడమేరు బాధితులకు భారీగా విరాళాలు సేకరించారని, ఆడబ్బులు ఎటు వెళ్లాయని ప్రశ్నించారు. బుడమేరులో డ్రామా నాయుడు చేసిన పనుల్లో అప్పుడే లికేజీలు మొదలయ్యాయన్నారు. పోలవరంలో అవినీతి జరిగిందనడానికి సిగ్గు ఉందా అని ప్రశ్నించారాయన. చంద్రబాబు పోలవరాన్ని ఏటీంఎంలా వాడుకున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన కామెంట్స్ను చంద్రబాబు మర్చిపోయారా? అని గుర్తు చేశారు.