-
అమీన్ పూర్ లేక్ లో వలస పక్షుల సందడి
-
అరుదైన పక్షిని ఎక్స్లో ట్వీట్ చేసిన రేవంత్ రెడ్డి
-
సుస్థిర పురోగతికి ఇదే నిదర్శనమంటూ ట్వీట్
తెలంగాణలో పర్యావరణ పరిరక్షణ గాడిలోపడుతోందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ ప్రక్రుతి ప్రేమికుల్లో సంతోషాన్ని కొత్త ఆశలను నింపుతోంది.అమీన్ పూర్ లేక్ పరిసరాల్లో కనిపించిన ఫ్లై కాచర్ అనే ఎర్ర మెడ కలిగిన అరుదైన పక్షి ఫోటోను షేర్ చేస్తూ ప్రక్రుతిని రక్షించుకుంటే అది తిరిగిచ్చే బహుమానాలు ఎన్నో ఉంటాయని రేవంత్ తన ఎక్స్ లో ట్వీట్ చేశారు.ప్రక్రుతితో చెలగాటమాడితే మానవాళినే కబళిస్తుందని అన్నారు. హైడ్రా చట్టం కఠినంగా అమలు చేయడం, పర్యావరణ హితమైన విధానాలు అమలు చేయడం తన ప్రభుత్వ ప్రధమ ప్రాధాన్యతలని ఈ సందర్భంగా రేవంత్ తన ట్వీట్ లో స్పష్టం చేశారు.
హైదరాబాద్ విశ్వనగరంగా శరవేగంగా ఎదుగుతోంది. ఈ క్రమంలోనే ఎన్నో కట్టడాలు, నిర్మాణాలు పెరిగిపోయాయి.దీనికి తోడు పట్టణీకరణవల్ల పెద్ద సంఖ్యలో జనాభా కూడా పెరిగిపోతున్నారు.మైదానాలు,భూ ఆక్రమణలు, అక్రమ కట్టడాలు, చెరువులు, సరస్సులు, నీటి కుంటల పూడ్చివేత వల్ల బయో డైవర్సిటీ దారుణంగా దెబ్బతింది.పరిస్థితిని గమనించిన తెలంగాణ ప్రభుత్వం చెరువుల పరిరక్షణకు నడుంబిగించింది. ఆక్రమణలను నిర్దాక్షిణ్యంగా తొలగించి అక్రమ కట్టడాలను కూల్చివేసి కుచించుకుపోతున్న చెరువులకు కొత్త ఊపిరి పోసింది. పర్యావరణాన్ని మెరుగు పరచి పచ్చదనంపైనా,సరస్సులపైనా మళ్లీ ఆశలు చిగురించేలా చేస్తోంది..
హైడ్రా ఒక గేమ్ ఛేంజర్..
మొదట్లో హైడ్రా చట్టంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత, విమర్శలు వచ్చినా ఆ తర్వాత మధ్యతరగతి పౌరులనుంచి ఊహించని రీతిలో మద్దతు వచ్చింది.ఆక్రమణలు, అక్రమ కట్టడాలను నిర్దాక్షిణ్యంగా తొలగించి నీటి కుంటల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవడంతో ప్రక్రుతి ప్రేమికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. హైడ్రా చట్టం ఒక గేమ్ ఛేంజర్ లా కనిపిస్తోంది. హైదరాబాద్ లో ప్రక్రుతి పరిరక్షణ మొదలైందని, పర్యావరణం కోలుకుంటోందని చెప్పడానికి అమీన్ పూర్ లేక్ పెద్ద ఉదాహరణ. ఆక్రమణలనుంచి ఆ చెరువును హైడ్రా కాపాడటంతో అక్కడి భూ గర్భ జలాలు పెరుగుతున్నాయి. సమీపంలో భూమి చిత్తడి నేలగా మారుతోంది.పచ్చదనం పరిఢవిల్లుతోంది. ఆ లేక్ లో పక్షుల సందడి కనిపిస్తోంది. ఎక్కడెక్కడినుంచో పక్షులు ఈ చెరువు దగ్గరకు చేరుకుంటున్నాయి. కిలాకిలా రావాలతో ఈ సరస్సు చుట్టు పక్కల వాతావరణం సందడిగా కనిపిస్తోంది.
రెడ్ బ్రెస్టెడ్ ఫ్లై క్యాచర్ రాకతో సందడి..
కేవలం 12 సెంటీమీటర్ల సైజులో కనిపించే రెడ్ బ్రెస్టెడ్ ఫ్లై క్యాచర్(ఎర్ర పిచ్చుక) వాస్తవానికి ఒక వలస పక్షి. ఎక్కడో తూర్పు యూరప్ దేశాలనుంచి వేల మైళ్లు ప్రయాణించి దక్షిణాసియా దేశాలకు ఈ పక్షి శీతాకాలంలో మాత్రమే వచ్చి విడిది చేస్తుంటుంది.చెరువు ఆక్రమణలతో కుచించుకుపోవడంతో ఈ పక్షుల అలికిడి కనిపించలేదు. ఇప్పుడు తాజాగా కనిపిచండం.. తమ ప్రభుత్వం చర్యలు సరైన దిశగానే ఉన్నాయని చెప్పడానికి ఈ పక్షే సాక్ష్యమని రేవంత్ తన ట్వీట్ లో పేర్కొనడం పర్యావరణ ప్రేమికులను కూడా సంతోష పెడుతోంది. రెడ్ బ్రెస్టెడ్ ఫ్లై క్యాచర్ పక్షులను తమ కెమెరాల్లో బంధించడానికి ఫోటో గ్రాఫర్లు,ప్రక్రుతి ప్రేమికులు కూడా అమీన్ పూర్ లేక్ కు వస్తున్నారు. ఈ పక్షి రాక ఆరంభమేనని త్వరలొనే వేలాదిగా ఇటువంటి వలస పక్షులు, కొంగలు వస్తాయని ఆశిస్తున్నారు. అమీన్ పూర్ లేక్ కు మునుపటి కళ వస్తోందని సంబర పడుతున్నారు.
అమీన్ పూర్ లేక్ ఇప్పుడు వలస పక్షుల కేంద్రంగానే కాదు పర్యావరణ సమతుల్యతతో కూడిన విధానాలను అనుసరిస్తున్న సుస్థిర పురోగతికి సంకేతంగా కనిపిస్తోంది. గ్రీన్ గవర్నెన్స్ పై ప్రత్యేక శ్రద్ధతో అడుగులేస్తున్న రేవంత్ ప్రభుత్వం ఈ విధానాలను ఇలాగే కొనసాగిస్తే ప్రక్రుతి, మానవాళికి అవినాభావ సంబంధంతో ఎదుగుతాయనడంలో సందేహం లేదు.