ఫార్ములా ఈ-రేసు కేసులో తనను ప్రశ్నించాలని విచారణకు పిలిచిన ఏసీబీ అధికారులు ఇబ్బంది పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఏసీబీ విచారణ పూర్తయిన తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు వెళ్లారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఉదయం నుంచి తనకు సంఘీభావంగా నిలిచిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. గత 10 సంవత్సరాలుగా అత్యంత నిబద్ధతతో, అవినీతి రహితంగా మంత్రిగా తన బాధ్యతలు నిర్వహించినట్లు ఏసీబీకి చెప్పానన్నారు. ఈ కేసులో ఎలాంటి అవినీతి లేకపోవడంతో ప్రశ్నలు అడిగే సమయంలో ఏసీబీ అధికారులు కూడా ఇబ్బందిపడ్డారన్నారు. ప్రపంచ దేశాలతో పోటీపడి తెచ్చిన ఫార్ములా ఈ రేసు హైదరాబాద్ నగరంలో ఉండాలన్న ఉద్దేశంతోనే రేసును కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పానన్నారు. అడిగిన ప్రశ్నలనే పదేపదే ఏసీబీ అధికారులు అడిగారన్నారు. ఇక్కడి నుంచి పోయిన డబ్బులు ఫార్ములా ఈ సంస్థ వద్ద ఉన్నాయని చెప్పానని, మరి అలాంటప్పుడు కేసు ఎక్కడ ఉందని తానే అడిగానన్నారు. విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వెళతానని కేటీఆర్ చెప్పారు. తాను మంత్రి గా నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశానన్నారు. న్యాయస్థానాలు, కోర్టుల పై తనకు నమ్మకం ఉందన్నారు. తప్పకుండా విచారణకు సహకరిస్తానని చెప్పారు. ఇది ముమ్మాటికి లొట్ట పీసు కేసే అన్నకేటీఆర్.. ఆయన లొట్ట పీసు ముఖ్యమంత్రే అని రేవంత్రెడ్డిని ఎద్దేవా చేశారు.