- రగలిపోతున్న తెలుగు తమ్ముళ్ళు
- సిస్కో కంపెనీ తరపున వచ్చాడని కవరింగ్
- ఏపీ ప్రాజెక్టులకు ఇప్పాల రవీంద్రను దూరం పెట్టమని సిస్కోకు లేఖ
రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పేషీలో మంగళవారం జరిగిన ఓ కీలక సమావేశం సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుండెలు రగిలిపోయేలా చేసింది. సోషల్ మీడియాలో ఎవరినైతే బద్దశత్రువుగా భావించి గడచిన పన్నెండేళ్లుగా టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు పోరాటం చేస్తున్నారో అదే వ్యక్తి నేడు నారా లోకేష్ ని కలసి ఫొటో తీయించుకుని వీడియో కూడా తీసుకుని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు. ఆ ఫొటోలు, వీడియోలు చూసిన టీడీపీ శ్రేణులు ఉదయం నుంచి రగిలిపోతున్నారు. అతన్ని కలసినందుకు లోకేష్ ని ఆయన పేషీ సిబ్బందిపై తీవ్ర స్ధాయిలో విరుచుకు పడుతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే… ఇప్పాల రవీంద్ర… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కరుడుకట్టిన అభిమాని, జగన్మోహన్ రెడ్డికి, వైఎస్.షర్మిలకి అత్యంత సన్నిహితుడు. ఆ పార్టీ తరపున తొలినాళ్ళలో సోషల్ మీడియాలో వీరోచిత పోరాటాలు చేసి అరెస్టులు కూడా అయ్యాడు. లోకేష్ ని, చంద్రబాబుని వ్యక్తిగతంగా కించపరిచేలా కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని అతన్ని బెంగుళూరులో అరెస్ట్ చేసి ఫ్లైట్లో విజయవాడ తీసుకువచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఎకాఎకీన లోకేష్ తో ఒప్పందాలు చేసుకుని ఆ ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో రిలీజ్ చేసేసరికి టీడీపీ సోషల్ మీడియన్లకు ఎక్కడో కాలింది. దీంతో ఉదయం నుంచి అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫారలాలపైనా తీవ్ర స్ధాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకీ విషయం ఏమిటంటే ఇంజనీరింగ్ విద్యార్థులకు డిజిటల్, ఐటీ అడ్వాన్స్ కోర్సుల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇప్పించే ఉద్దేశంతో ప్రముఖ ఐటీ సంస్ధ సిస్కోతో ఏపీ స్కీల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లోకేష్ సమక్షంలో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం కోసం సిస్కో బృందంతో ఇప్పాల రవీంద్ర కూడా లోకేష్ నివాసానికి వచ్చాడు. ఈ సిస్కో కంపెనీలో రవీంద్ర టెరిటరీ సేల్స్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. అంటే మూడు రాష్ట్రాలకు అతను సిస్కో కంపెనీకి సేల్స్ ఇన్ఛార్జ్. లోకేష్ తో నేటి ఒప్పంద కార్యక్రమం మొత్తాన్ని ఇప్పాల రవీంద్రే కోఆర్డినేట్ చేశారు. అయితే కార్యక్రమం అంతా అయిపోయాక ఈ విషయంపై సోషల్ మీడియాలో రచ్చ అవడం తెలిసి లోకేష్ టీమ్ కూడా ఖంగు తిన్నారు. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. లోకేష్ ఓఎస్డీ వెంకట సాయి చైతన్య సిస్కో లీడర్షీప్ టీమ్ కి లేఖ రాశారు. ఇప్పాల రవీంద్ర గతంలో లోకేష్ మీద నారా చంద్రబాబు నాయుడి మీద వల్గర్ పోస్టులు పెట్టాడని అందువల్ల ఏపీలో సిస్కో చేపట్టే ప్రాజెక్టులకు అతన్ని దూరంగా ఉంచమని కోరుతూ లేఖ రాశారు.