భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు ఇప్పటికే దారుణంగా దిగజారిపోయాయి. ఇలాంటి సమయంలోనే బంగ్లాదేశ్లో తగులపడిపోయిన ఓ చారిత్రక భవనం ఇప్పుడు ఇరు దేశాల సంబంధాలను మరింత దిగజార్చింది. బంగ్లాదేశ్లో బుధవారం రాత్రి హింస చెలరేగింది. ఆందోళనకారులు బుధవారం రాత్రి మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి, బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రెహమన్ చారిత్రక ఇంటికి నిప్పు అంటించారు. అంతేకాదు హసీనా దివంగత భర్త, మరికొందరు అవామీ లీన్ నేతల ఇళ్లకు కూడా నిప్పుపెట్టారు. అయితే ఈ ఘటన తర్వాత కొన్ని పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. దీంతో ఇరు దేశాల విదేశాంగశాఖల మధ్య డైలాగ్ వార్ జరిగింది.
అసలేమంది అంటే…
బంగ్లాదేశ్లోని తాత్కాలిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలపాలని షేక్ హసీనా పిలుపునిచ్చారు. ఓ వైపు ఆమె ప్రసంగం కొనసాగుతుండగానే ఈ దాడులు మొదలయ్యాయి. ఈ దాడులపై ఆమె తీవ్రంగా స్పందించారు. తన కుటుంబానికి ఉన్న ఒక్కగానొక్క జ్ఞాపకాన్ని కూడా నాశనం చేశారని.. భవనాన్ని కూల్చేయవచ్చు కానీ చరిత్రను కూల్చలేరు అంటూ తీవ్రంగా స్పందించారు హసీనా. నిజానికి ఈ భవనంతో భారత్కు కూడా సంబంధం ఉందనే చెప్పాలి. బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటంలో జరిగిన చారిత్రక ఘటనలకు సంబంధించిన ఎన్నో ఆధారాలు ఈ ఇంట్లో ఉన్నాయి. అందుకే ఈ ఘటనపై భారత ప్రభుత్వం కూడా స్పందించింది. ఇది చాలా విచారకరమైన ఘటన అని తెలిపింది. బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటం, బంగ్లాదేశ్ అస్థిత్వానికి ఈ భవనం ఓ ప్రతీక అని తెలిపింది భారత విదేశాంగశాఖ.
అయితే హసీనా చేసిన ప్రకటనపై బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పందించింది. ఢాకాలోని భారత హైకమిషనర్కు సమన్లు జారీ చేసింది. హసీనా చేసిన ప్రకటనపై నిరసనను వ్యక్తం చేసింది. అంతేకాదు.. ఆమె చేస్తున్న ప్రకటనలను కంట్రోల్ చేయాలని రాతపూర్వకంగా రిక్వెస్ట్ చేసింది. ఈ విషయంపై భారత విదేశాంగశాఖ వెంటనే స్పందించింది. హసీనా చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమని.. వాటితో భారత్కు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. భారత్ ఎప్పుడూ బంగ్లాదేశ్తో మంచి సంబంధాలనే కోరుకుంటుందని.. కానీ బంగ్లా తీరుతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందంటూ కౌంటర్ ఇచ్చింది.
మరోవైపు బంగ్లాదేశ్లో అల్లర్లు మరోసారి కంటిన్యూ అవుతున్నాయి. అవామీ లీగ్ నేతల ఇళ్లను టార్గెట్ చేసుకొని ఓ వర్గం వారు రెచ్చిపోతున్నారు. దీంతో ప్రభుత్వం వెంటనే అల్లర్లను ఆపాలంటూ కోరింది. దేశాన్ని అస్థిరత్వం చేసే పనులను ఆపకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయితే ప్రభుత్వం మద్దతుతోనే ఈ అల్లర్లు, దాడులు కొనసాగుతున్నాయన్న ప్రచారం కూడా జరుగుతోంది.