ప్రెస్ నోట్ విడుదల చేసిన వీడీ పీఆర్ టీమ్
చట్టప్రకారం నిర్వహిస్తున్న స్కిల్ బేస్డ్ గేమ్స్ కు మాత్రమే హీరో విజయ్ దేవరకొండ యాడ్స్ చేశారని ఆయన పీఆర్ టీమ్ ఒక ప్రకటనలో పేర్కొంది. బెట్టింగ్ యాప్స్ కు హీరో విజయ్ దేవరకొండ ప్రచారం చేశాడనే రూమర్స్ ప్రసారమవుతున్న నేపథ్యంలో ఆయన టీమ్ ఈ అసత్య వార్తలపై క్లారిటీ ఇచ్చింది. స్కిల్ బేస్డ్ గేమ్స్ కు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారం నిర్వహించాడని, ఆ కంపెనీలు చట్టప్రకారమే నిర్వహిస్తున్నాయని ఈ సందర్భంగా విజయ్ పీఆర్ టీమ్ తెలియజేసింది. ఆన్ లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అనుమతి ఉన్న ప్రాంతాలకు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా పరిమితమయ్యారని తెలిపారు.
విజయ్ దేవరకొండ ఏ యాడ్ చేసినా, ఏ కంపెనీకి ప్రచారకర్తగా ఉన్నా ఆ కంపెనీని లీగల్ గా నిర్వహిస్తున్నారా లేదా అనేది ఆయన టీమ్ క్షుణ్ణంగా పరిశీలిస్తుందని, ఆ కంపెనీ లేదా ప్రాడక్ట్ కు చట్టప్రకారం అనుమతి ఉంది అని వెల్లడైన తర్వాతే విజయ్ ఆ యాడ్ కు ప్రచారకర్తగా ఉంటారని వీడీ పీఆర్ టీమ్ విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు. విజయ్ దేవరకొండ అలాంటి అనుమతి ఉన్న ఏ 23 అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారని, రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని గతంలో పలుమార్లు గౌరవనీయ సుప్రీం కోర్టు తెలియజేసిందని గుర్తు చేశారు.
ఏ 23 అనే కంపెనీతో విజయ్ దేవరకొండ ఒప్పందం గతేడాది ముగిసిందని చెప్పారు. ఇప్పుడు ఆ సంస్థతో విజయ్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు. విజయ్ దేవరకొండ విషయంలో పలు మాధ్యమాలలో ప్రసారమవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. విజయ్ ఇల్లీగల్ గా పనిచేస్తున్న ఏ సంస్థకూ ప్రచారకర్తగా వ్యవహరించలేదని ఆయన పీఆర్ టీమ్ పునరుద్ఘాటించింది.