ఇరాన్కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అణు ఒప్పందానికి అంగీకరించకపోతే ఇరాన్పై బాంబుల వర్షం కురిపిస్తామన్నారు ఆయన. అలాంటి దాడులు ఇరాన్ ఎప్పుడూ చూసి ఉండదన్నారు ట్రంప్. అంతేకాదు ఇప్పటికే ఇరాన్పై విధించిన ఆంక్షలను కొనసాగిస్తూనే.. మరిన్ని ఆంక్షలను విధిస్తామన్నారు ట్రంప్.
మరోవైపు అమెరికాతో చర్చలను జరిపేది లేదని తేల్చి చెప్పింది ఇరాన్. చర్చలకు రావాలంటూ ట్రంప్ రాసిన లేఖను తోసిపుచ్చారు. అణు ఒప్పందం విషయంలో అమెరికాతో ఎలాంటి చర్చలు ఉండవని తేల్చి చెప్పింది ఇరాన్. అయితే పరోక్ష చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పకనే చెప్పింది ఇరాన్.
2018 నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు అంతకంతుకు పెరుగుతూ వస్తున్నాయి. దీనికి కారణం కూడా ట్రంప్ తన మొదటి హయాంలో తీసుకున్న నిర్ణయాలే అని చెప్పాలి. అప్పుడు 2018లో ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా బయటికి వచ్చింది. అణు ఒప్పందంపై తీవ్రమైన ఆంక్షలు విధించి.. ఇతర ఆంక్షలను తాత్కాలికంగా సడలించారు. కానీ ట్రంప్ నిర్ణయంతో మళ్లీ ఆంక్షల చట్రంలో ఇరుక్కుంది ఇరాన్. అప్పటి నుంచి ఇరాన్ తన అణు సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోయిందన్న అనుమానాలు ఉన్నాయి.
ఇప్పటికే ఇరాన్కు చెందిన ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ఇరాన్ డెవలప్ చేసిన అత్యాధునిక మిసైల్స్ను ఓ టన్నెల్లో ఉంచినట్టు కనిపిస్తోంది. కిలోమీటర్ల పొడవున్న ఈ టన్నెల్స్లో అత్యాధునిక క్షిపణులు కనిపిస్తున్నాయి. వాటి సంఖ్య వేలల్లో ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఇరాన్ ఆర్మీ ఉపయోగించే ఆర్టిలరీ కూడా అందులో కనిపిస్తోంది. దీంతో తాము అమెరికా బెదిరింపులను పట్టించుకోమని చెప్పకనే చెప్పినట్టైంది. దీంతో ట్రంప్ తన నోటికి మరింత పని చెప్పినట్టు కనిపిస్తోంది. అయితే ఈ మాటలు చేతల వరకు వెళతాయా? లేదా? అనేది చూడాలి.