జనసేనలో చేరికలు నిలిచిపోయాయి. కొద్ది రోజుల నుంచి కార్పేటర్లు మినహాయించి నేతలు ఎవరు రావడం లేదు. అదీ విశాఖ వంటి ప్రాంతాల్లో మాత్రమే చేరికలు జరిగాయి. ఒక స్థాయి నేతలు ఎవరూ జనసేనలో చేరకపోవడానికి కారణాలేంటన్న దానిపై పార్టీలో చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తొలినాళ్లలో జనసేనలో భారీ స్థాయిలో చేరికలు జరిగాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయ భాను, కిలారు రోశయ్య తదితరులు పార్టీలో చేరారు. దీంతో ఇంకా అనేక మంది క్యూలో ఉన్నారన్న ప్రచారం సాగింది. కొందరు నేతలు టీడీపీ వైపు వెళ్లిపోయారు.
జనసేనలో చేరిన వారంతా పెద్దగా యాక్టివ్ గా లేకపోవడంతో పాటు వారికి ప్రాధాన్యత కూడా దక్కడం లేదన్న అభిప్రాయం బలపడింది. పవన్ కల్యాణ్ వద్దకు వెళ్లాలంటే ముందు చాలా మంది నేతలను దాటుకుని వెళ్లాల్సి ఉంటుందని, కండువా కప్పే సమయంలో తప్ప మరోసారి ఆయనను కలిసే అవకాశముండదని అర్థమయింది. వైసీపీలో జగన్ తరహాలోనే ఇక్కడ కూడా ఉండటంతో రెండింటికీ పెద్ద తేడా ఏముందన్న ప్రశ్న వలస నేతల్లో ఆందోళన కలిగిస్తోంది.
తోట త్రిమూర్తులు వంటి వారు కూడా జనసేనలోకి వస్తారని, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి పెద్దయెత్తున నేతలు వచ్చి చేరిపోతారన్న ప్రచారం.. ప్రచారానికే పరిమితమైంది. చేరికలకు పవన్ కల్యాణ్ పెద్దగా ఆసక్తి కనపర్చడం లేదని తెలిసింది. నేతలు ఎక్కువయ్యే కొద్దీ అనవసర టెన్షన్ తప్ప మరొకటి ఉండదని భావించి పవన్ కల్యాణ్ చేరికలకు సుముఖంగా లేరంటున్నారు. సాఫీగా సాగుతున్న పార్టీలో కొత్త వారిని చేర్చుకుని తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకనే ఆలోచనతో ఉన్నారని అంటున్నారు.
విశాఖ నేత అవంతి శ్రీనివాస్ జనసేనలో చేరేందుకే వైసీపీకి రాజీనామా చేసినప్పటికీ పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఆయన టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. కాపు వర్గానికి చెందిన ఆళ్ల నాని…పవన్ కళ్యాణ వైఖరి నచ్చకే టీడీపీలో చేరిపోయారని సన్నిహితులు చెపుతుంటారు. ఇలా అనేక మంది నేతలు ప్రయత్నించినప్పటికీ పవన్ కల్యాణ్ వ్యవహారంతో చల్లపడ్డారని సమాచారం. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోవడంతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని, దీంతో జనసేన, టీడీపీలో చేరడం కంటే వైసీపీలో కొనసాగడమే మంచిదన్న ఆలోచనలో కొందరు ఉన్నారు.