ఎవరి పేరు చెబితే శత్రువులు భయపడిపోతారో.. ఎవరి పేరు చెబితే హిందూ మతంలో ఉత్సాహం ఉరకలెత్తుతుందో.. ఎవరి పేరు చెబితే గెరిల్లా యుద్ధం గుర్తుకొస్తుందో.. ఎవరైతే చీకట్లో నిప్పుకణికలా దూసుకొస్తారో ఆయనే మరాఠా మహాయోధుడు ఛత్రపతి శివాజీ…
శివాజి మహారాజ్ 395వ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం..
భారతదేశంపై దండెత్తిన మొఘలు రాజులతో యుద్ధంలో ఓడిపోయి అందరూ చేతులెత్తేశారు. దీంతో మన దేశంలో హిందూ దేశం అంతరించిపోతుందని అంతా భావించారు. అదే సమయంలో కారు చీకట్లో ప్రకాశించే చంద్రుడిలా వెలుగులోకొచ్చాడు ఛత్రపతి శివాజీ మహారాజ్. మొఘలుల దాడిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. వీరోచితంగా పోరాడాడు. గెరిల్లా యుద్ధాన్ని తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేశాడు. స్వతంత్ర మరాఠా సామ్రాజ్యానికి నాంది పలికిన వీరుడు.
ఎన్నో కోటలను స్వాధీనం చేసుకున్నాడు. అన్ని మతాలను సమానంగా చూసిన గొప్ప మహారాజు ఛత్రపతి శివాజీ. 17వ ఏటనే యుద్ధ భూమిలోకి అడుగు పెట్టాడు. చిన్న వయసులోనే ఆయన మొఘలు రాజులను ఎదుర్కొన్నాడు. బాల్యం నుండి ఆయన వీర మరణం వరకు మొఘలులకు ముచ్చెమటలు పట్టించినా.. అన్ని మతాలను సమానంగా చూసిన గొప్ప మహారాజు ఛత్రపతి శివాజీ.
శివాజీ జననం..
క్రీస్తు శకం 1630వ సంవత్సరంలో ఫిబ్రవరి 19వ తేదీన, వైశాఖ మాసపు, శుక్ల పక్షం తదియ రోజున మహారాష్ట్రలోని పూనే జిల్లా జునార్ లోని శివనేర్ కోటలో జిజియాబాయి, షహాజీ దంపతులకు శివాజీ జన్మించారు. అయితే కొందరు ఆయన 1627 సంవత్సరంలోనే జన్మించారని చెబుతుంటారు. భారతదేశం గర్వించదగ్గ వీరపుత్రులలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. స్వతంత్ర భారతం కోసం పోరాడిన గొప్ప మరాఠా యోధుడిగా పేరు సంపాదించుకున్నారు.
తల్లి దగ్గరే..
శివాజీ మహారాజ్ తన తల్లి దగ్గర నుండి పరమత సహనం, మహిళల పట్ల గౌరవంగా ఉండటాన్ని నేర్చుకున్నాడు. చిన్న వయసులోనే తను పుట్టిన భూమిపైన, ప్రజలతో ఎలా మెలగాలో శివాజీకి తన తల్లి జిజియాబాయి నేర్పించింది. ఆయన తండ్రి పూనేలో జాగీర్దార్ గా ఉండేవారు.
ఔరంగజేబుకు వ్యతిరేకంగా..
చరిత్ర గురించి తెలియని చాలా మంది వ్యక్తులు ఛత్రపతి శివాజీని ముస్లిం వ్యతిరేకని ఆరోపణలు చేస్తుంటారు. అందులో ఏ మాత్రం వాస్తవం లేదు. ఎందుకంటే అతని సైన్యంలో చాలా మంది ముస్లిం వీరులు, యోధులు ఉండేవారు. ఎందరో ముస్లిం సర్దార్లు, సుబేదార్లుగా ఉండేవారు. అంతేకాదు హిందువుగా మారిన ఓ వ్యక్తికి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి కూడా చేశాడు. హిందూ మత రక్షణ కోసమే ముస్లిం దురాక్రమణదారులతో యుద్ధం చేశాడు తప్ప ఎప్పుడూ వారి మతాన్ని వ్యతిరేకించలేదు. అయితే ఔరంగజేబు వంటి రాజుల దురహంకారానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు.
భయం నుండి విముక్తి..
1674వ సంవత్సరంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆడంబరంగా సింహాసనాన్ని అధిష్టించాడు. తను స్వతంత్య్ర సార్వభౌమత్వానికి పునాది వేశారు. అప్పటివరకు అణచివేతకు గురైన హిందూ ప్రజానీకాన్ని భయం నుండి విముక్తి పొందేలా చేశారు. అప్పట్లో క్రైస్తవ, ముస్లిం పాలకులు బలవంతంగా మెజార్టీ హిందూ ప్రజలపై తమ అభిప్రాయాలను రుద్దేవారు. అయితే శివాజీ వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రార్థనా స్థలాలు పరిరక్షించబడ్డాయి. అంతేకాదు మతం మారిన ముస్లింలు, క్రైస్తవులకు భయం లేని వాతావరణాన్ని కల్పించడానికి సిద్ధమయ్యారు.
శివాజీ పాలనలో..
ఛత్రపతి శివాజీ మహారాజ్ తన రాజ్యంలో ఎనిమిది మంది మంత్రుల మండలిని కొనసాగించారు. ఆరు సంవత్సరాల పాటు శివాజీ పరిపాలించగా.. అందులో చాలా మంది ముస్లింలు కూడా పాల్గొన్నారు. శివాజీ బాల్యంలో తన తల్లి జిజియా బాయ్ వద్ద పెరిగారు. ఆ వీర మహిళ పరమత సహనం వంటి స్వభావం కలిగినవారు. అదే సమయంలో శివాజీ భారతదేశంలోని ధైర్యవంతుల ప్రకాశవంతమైన కథలను వింటూ మరియు బోధిస్తూ పెరిగాడు. చిన్నతనంలోనే దాదా కొండేవ్ ఆధ్వర్యంలో, ఆయన సమయోచిత యుద్ధంలో ప్రావీణ్యం సంపాదించారు.
చిన్నప్పుడే కోట క్రీడలు..
శివాజీ తన చిన్నతనంలో పిల్లలను పోరాటం కోసం సిద్ధం చేసేవారు. అందులో తను నాయకుడిగా ఉంటూ ప్రత్యర్థులతో పోరాడి కోటను గెలిపించే క్రీడలలో పాల్గొనేవాడు. యవ్వనంలోకి రాగానే తన ఆటను శత్రువులపై ప్రయోగించాడు. తన వ్యూహాలతో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసేవాడు. శత్రువులు మేల్కొలేనేలోపే వారి కోటపై దాడి చేసి గెలవడం ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో పురందర్, తోరన్ వంటి కోటలపై శివాజీ తన అధికారాన్ని చేపట్టారు. ఆ వెంటనే తన పేరు దక్షిణ భారతమంతా వ్యాపించింది. ఇది అగ్నిలా మారి ఆగ్రా, ఢిల్లీకి సైతం చేరుకుంది. నిరంకుశమైన తురుష్కులు, యవ్వనులు వారి సహాయపాలకులంతా శివాజీ పేరు వినగానే భయంతో ఆందోళన చెందేవారు.
గెరిల్లా యుద్ధం..
భారతదేశంలో మొట్టమొదటి సారిగా ఛత్రపతి శివాజీ గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. తన యుద్ధ విన్యాసాల స్ఫూర్తితోనే వియత్నామీస్ అమెరికాను నిలువరించారని చరిత్రకారులు చెపుతారు. ఆ కాలంలో రచించి ‘శివ సూత్రం’లో ఈ యుద్ధ ప్రస్తావన కనిపిస్తుంది. గెరిల్లా యుద్ధం అనేది శత్రువులపై మెరుపుదాడులు చేయడం లేదా క్రమ రహిత దళాలు ఉప్పెనలా మీద పడటం అని చెబుతారు.
అఫ్జల్ ఖాన్ అంతం..
తన కంటే బలవంతుడైన అఫ్జల్ ఖాన్ ను శివాజీ ఎంతో చాకచక్యంగా అంతం చేసేశాడు. అఫ్జల్ పథకాన్ని ముందుగానే పసిగట్టిన శివాజీ తన చేతులకు పులిగోళ్లను తొడుక్కుని అతడిని హతమార్చాడు. దీంతో శివాజీ మహారాజు మరాఠా యోధుడిగా పేరు తెచ్చుకున్నాడు. అలా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోయాడు. అదే సమయంలో సొంతంగా సైన్యాన్ని తయారు చేసుకున్నారు. శివాజీ మరణించే సమయానికి తన సైన్యంలో 30 నుండి 40 వేల మంది శాశ్వతంగా నియమించబడిన అశ్వికదళం, లక్ష పదాతి మరియు 1260 ఏనుగులు ఉన్నాయి.