ప్రపంచం అంతా ప్రస్తుతం భారత్ వైపు చూస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. భవిష్యత్ భారతీయులదేనని ఆయన పేర్కొన్నారు. మద్రాస్ ఐఐటీలో నిర్వహించిన ‘ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ 2025’ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై చంద్రబాబు ప్రసంగించారు.
మద్రాస్ ఐఐటీ అనేక విషయాల్లో ప్రథమస్థానంలో ఉందని, ఆన్లైన్ కోర్సులు కూడా అందిస్తోందన్నారు. ఐఐటీ మద్రాస్కు చెందిన స్టార్టప్ అగ్నికుల్ విజయవంతమైన సంస్థగా గుర్తింపు పొందిందని, ఇక్కడి స్టార్టప్లలొ 80 శాతం విజయవంతమవుతున్నాయని, ఈ ఐఐటీలో సుమారు 35-40 శాతం తెలుగు విద్యార్థులే ఉన్నారన్నారు. ఐఐటీల స్థాపన భారత విద్యావ్యవస్థకు గొప్ప పురోగతి అన్న చంద్రబాబు.. 1991లో అమలు చేసిన ఆర్థిక సంస్కరణలు దేశ ముఖచిత్రాన్ని మార్చేశాయన్నారు. అయితే, అవి ఎంపిక కాదని, అవసరం అన్నారు. అదే సమయంలో చైనా ఆర్థిక సంస్కరణలు చేపట్టి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, భారత్ కూడా ఆ మార్గంలో అభివృద్ధి సాధించిందన్నారు. బ్రిటిష్ వాళ్లు మనదేశం నుంచి అంతా తీసుకెళ్లి, ఇంగ్లీష్ భాష మాత్రమే వదిలారన్నారు.
1990లలో కమ్యూనికేషన్ రంగంలో బీఎస్ఎన్ఎల్, వీఎస్ఎన్ఎల్ గుత్తాధిపత్యం ఉండేదని, ఆర్థిక సంస్కరణల తర్వాత ప్రైవేటు సంస్థల ప్రవేశం గేమ్ ఛేంజర్గా నిలిచిందన్నారు.
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ను కలవాలని తొలుత ప్రయత్నించినప్పుడు ఆయన రాజకీయ నేతలతో సంబంధాలు వద్దనుకున్నారని, అయినప్పటికీ, ఒప్పించి అపాయింట్మెంట్ పొందానన్నారు. 45 నిమిషాల పాటు ఆయనతో మాట్లాడి హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరానని, ఇప్పుడు అదే సంస్థకు సీఈవోగా తెలుగు వ్యక్తి సత్య నాదెళ్ల ఉన్నారని చంద్రబాబు వివరించారు.
భారత్ వృద్ధిరేటు ప్రపంచంలోనే అత్యధికంగా ఉండడం గమనార్హమన్నారు. 2014లో మనది ప్రపంచంలోని పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాగా, ప్రస్తుతం ఐదో స్థానానికి చేరుకుందన్నారు. మనకు ఉన్న డెమోగ్రాఫిక్ డివిడెండ్ గొప్పవరం అని, మనం కృషి చేస్తే త్వరలోనే ప్రపంచ అగ్రదేశంగా భారత్ ఎదుగుతుందని సూచించారు. చాలా దేశాలు జనాభా తగ్గుదలతో ఎదుర్కొంటున్న సమస్య మనకు మరో 40 ఏళ్ల వరకూ ఉండదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.