వైఎస్ఆర్సీపీ నాయకులతో వైఎస్.జగన్
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి హనీమూన్ పిరియడ్ ముగిసిపోయిందని… ఇకపై ప్రభుత్వ తప్పిదాలన్నింటిపైనా రాజీలేని పోరాటాలు చెయ్యాలని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి అన్నారు. విదేశీయాత్ర ముగించుకుని తిరిగి తాడేపల్లి చేరుకున్న వైఎస్.జగన్ పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన అనేక విషయాలను నాయకులతో చర్చించినట్లు సమాచారం. కూటమి ప్రభుత్వానికి హనీమూన్ పిరియడ్ ముగిసిందని ఇక మన పార్టీ నాయకులు, శ్రేణుల రోడ్డు ఎక్కాలని ఆయన నేతలో అన్నట్లు తెలుస్తోంది. పార్టీ క్యాడర్ ఎన్నికలు అయిన మరుసటి రోజు నుంచే అధికార పక్షం ఆగడాలపైనా, ప్రజావ్యతిరేక ప్రభుత్వ విధానాలపైనా పోరాడటానికి రెడీగా ఉందని ఇక నాయకులే గేర్అప్ కావాలని ఆయన సూచించినట్లు తెలిసింది. తాను కూడా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళడంతో పాటు కార్యకర్తలతో కూడా సమావేశాలు నిర్వహిస్తానని జగన్ వైసీపీ నేతలతో అన్నట్లు సమాచారం. అలాగే ప్రతి నియోజవర్గంలో నాయకులందరూ సమన్వయంతో పని చేయాలని, కార్యకర్తలతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వాలని జగన్ సూచించారు. ఇకపై ప్రభుత్వనికి వ్యతిరేకంగా పార్టీ తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని గ్రామ, మండల స్ధాయి నుంచి విజవంతంగా నిర్వహించాలని జగన్ అన్నారు. ఎన్నికల హామీలు అమలు చెయ్యకుండా కూటమి ప్రభుత్వం దారుణంగా ప్రవర్తిస్తోందని, పైపెచ్చు ఆర్థికలోటు వల్ల హామీలు అమలు చేయలేమని నిష్కర్షగా చెపుతున్నారని… ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల్లో అసంతృప్తి రోజు రోజుకీ పెరుగుతోందని వైసీపీ నేతలకు జగన్ వివరించారు. ఇక ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా ప్రభుత్వ ప్రజాకంటక పనితీరును వైఎస్ఆర్సీపీకి చెందిన ప్రతి నాయకుడు నిశితంగా విమర్శించాలని, అవసరమైనప్పుడు ప్రజల్లోకి వెళ్ళి వారికి పరిస్ధితులు వివరించి నిరసన కార్యక్రమాలను కూడా నిర్వహించాలని జగన్మోహన్రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. అలాగే వచ్చే బడ్జెట్ సమావేశాలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగ కార్యక్రమానికి తనతో పాటుగా వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులందరూ హాజరవ్వాలని ఈ సందర్భంగా జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.