26.1 C
Hyderabad
Tuesday, June 30, 2026

Live Video

spot_img

రాయలసీమ జిల్లాలపై టీడీపీ ఫోకస్‌

మొన్నటి ఎన్నికల్లో గెలిచాం. అధికారంలో ఉన్నా..ఇక అంతా లైట్ అంటే కుదరదు. వచ్చే ఎన్నికల కోసమే కాదు.. ఫ్యూచర్ ప్లానింగ్‌ కూడా పకడ్బందీగా ఉండాలంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాయలసీమలో వైసీపీని తిరిగి పుంజుకోవ్వకుండా చేస్తామంటూ వ్యూహాలు రచిస్తున్నారు. ఓ వైపు ప్రభుత్వ పరంగా రాయలసీమ నాలుగు జిల్లాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది వైసీపీ. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ రెగ్యులర్ పర్యటనలు.. సీఎం చంద్రబాబు అభివృద్ధి పేరుతో రాయలసీమ వాసులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే మహానాడుకు రాయలసీమనే వేదికగా ఎంచుకుంది టీడీపీ. పైగా జగన్ ఇలాకా కడపలో పసుపు పార్టీ సంబురం హోరెత్తబోతోంది.

మహానాడు టీడీపీకి ఒక పండుగ. పార్టీలో ఉన్న క్యాడర్ మొత్తం ఎంతో ఉత్సాహంగా పాల్గొంటుంది. 2023లో రాజమండ్రిలో టీడీపీ మహానాడు జరిగింది. ఆనాడు రాజమండ్రిలో నభూతో నభవిష్యత్తు అన్నట్లుగా పార్టీ కార్యక్రమాలు సాగాయి. సూపర్ సిక్స్ పథకాల గురించి ఆనాడే ప్రస్తావించారు. దాంతో గోదావరి జిల్లాలలో రాజకీయం గేర్ మార్చింది మహానాడు. అలా వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కకుండా చేసి కూటమి కట్టి మరీ టీడీపీ గోదావరి తీరంలో రాజకీయాన్ని తమ వైపు తిప్పుకుంది. ఇక 2024లో మహానాడు నిర్వహించలేదు. అప్పటికి ఏపీలో ఎన్నికలు పూర్తయిపోయాయి. ఫలితాల కోసం వేచి చూసే పరిస్థితి ఉంది. దాంతో ఈ సారి ఘనంగా నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు.ఇప్పుడు టీడీపీ బంపర్ విక్టరీ కొట్టి పూర్తి ఉత్సాహంలో ఉంది. పైగా వైసీపీ దారుణమైన ఓటమిని మూటగట్టుకుని.. నేతల వరుస రాజీనామాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. సరిగ్గా ఇదే సమయంలో కడపలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించింది టీడీపీ. మే 27, 28 తేదీల్లో జరిగే మహనాడుకు ఇప్పటి నుంచే సన్నాహాలు చేయాలని పార్టీ నుంచి ఆదేశాలు వెళ్ళాయి. కడప గడపలో వైసీపీని కోలుకోకుండా చేయడం జగన్ సొంత ఇలాకాలో బస్తీమే సవాల్ విసరడం ద్వారా సీమలో రాజకీయాన్ని ఏకపక్షం చేయాలని టీడీపీ వ్యూహ రచన చేస్తోంది. 52 అసెంబ్లీ సీట్లు ఉన్న రాయలసీమలో వైసీపీకి అరడజన్ సీట్ల కంటే కూడా తక్కువే వచ్చాయి. దాంతో రాయలసీమలో వైసీపీ గాలి పూర్తిగా తగ్గిపోయిందని టీడీపీ భావిస్తోంది. దాంతో తమకు ప్రజలు ఇచ్చిన మద్దతుతో అడ్డాగా మార్చుకోవాలని.. రాయలసీమలో పూర్తి స్థాయిలో పైచేయి సాధించాలని చూస్తోంది. జగన్ సొంత జిల్లా వైసీపీ పార్టీకి కంచుకోట అయిన కడపలో పది అసెంబ్లీ సీట్లు ఉంటే కేవలం మూడు మాత్రమే వైసీపీకి గత ఎన్నికల్లో దక్కాయి. ప్రభుత్వం కూడా రాయలసీమ అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది. ఇప్పుడు రాజకీయంగా కూడా సీమలో సైకిల్‌ను నిరంతరంగా పరుగులు పెట్టించాలని టీడీపీ చూస్తోంది. అందుకే రాయలసీమకు గుండెకాయ లాంటి కడపను ఈసారి మహానాడుకు ఎంచుకున్నామంటున్నారు తెలుగు తమ్ముళ్లు.

రాయలసీమ నాలుగు జిల్లాల్లో మొత్తం 52 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా మ్యాజిక్ ఫిగర్ 88 సీట్లు. అందులో సగానికంటే ఎక్కువ సీట్లు రాయలసీమ రీజియన్‌లోనే ఉన్నాయి. అందుకే వైసీపీని రాయలసీమలోనే కోలుకోలేని దెబ్బకొట్టాలని భావిస్తోందట టీడీపీ. అందుకోసం చంద్రబాబు చాణక్య వ్యూహాలనే అమలు చేస్తున్నారట.పక్కా వ్యూహంలో భాగంగానే తరచూ రాయలసీమ పర్యటనలు చేస్తున్నారట డిప్యూటీ సీఎం పవన్. ఈ మధ్యే కడప వెళ్ళి మరీ ఎంపీడీవో మీద జరిగిన దాడిని ఖండించి వచ్చారు. ఏకంగా రాయలసీమలోనే క్యాంప్‌ ఆఫీస్‌ పెడుతానంటూ ప్రకటించేశారు. రాయలసీమ మీ జాగీరు కాదు..గుండూగిరి చేస్తే ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు పవన్. లేటెస్ట్‌గా కర్నూలు జిల్లాలో వెళ్లి రోజంతా అక్కడే ఉండి గ్రీన్ కో ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు.ఇదంతా ఎందుకు అంటే వైసీపీని రాజకీయంగా నిలువరించడానికేనన్న చర్చ జరుగుతోంది. రాయలసీమలో కూటమిలో ఉన్న బీజేపీ, జనసేన బలానికి..టీడీపీ బలం తోడైతే మరోసారి సీమలో ఎదురు ఉండదని భావిస్తున్నారట. అందుకే వైసీపీకి హార్డ్ కోర్ రీజియన్‌గా ఉన్న రాయలసీమలోనే టీడీపీ మహానాడు నిర్వహించాలని డిసైడ్ అయ్యారట.ఇలా పార్టీ పండుగకు కడపను ఎంచుకోవడం వెనుక రాజకీయ వ్యూహం ఉందన్న చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఫలితాలు కట్టబెట్టిన రాయలసీమ వాసులకు కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు భవిష్యత్తులో కూడా ఆ ప్రాంత వాసులను తమకు అనుకూలంగా మల్చుకునే ప్లాన్‌లో భాగంగానే రాయలసీమలో మహానాడు నిర్వహించాలని డిసైడ్ అయ్యారట. జగన్‌ కంచుకోటలో.. చంద్రబాబు రాజకీయ వ్యూహాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి మరి.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com