25వేల మంది టీచర్ల నియామకాలను రద్దు చేస్తూ సుప్రీం కోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. పశ్చిమ బెంగాల్లో 2016లో చేపట్టిన నియామకాలపై సర్వోన్నత న్యాయస్థానం ఈ తీర్పు ఇచ్చింది. ఈ పరిణామం పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వానికి భారీ షాక్ ఇచ్చింది.
పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ కింద 25 వేల మందికి పైగా ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందిని నియమించారు. 2016లో వీరిని నియమించారు. అయితే, ఈ నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇప్పటికే తీర్పు ఇచ్చింది. ఈ నియామకాలను రద్దు చేస్తూ హైకోర్టు 2024లో తీర్పు ఇచ్చింది. అయితే, కొందరు ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
కోల్కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఇప్పుడు సమర్థించింది. హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకునేందుకు సరైన కారణాలు లేవని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి పివి సంజయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
అయితే, హైకోర్టు ఉత్తర్వులకు అత్యున్నత న్యాయస్థానం కొన్ని మార్పులు చేసింది. ఉద్యోగులు 2016లో నియామకం అయినప్పటి నుండి వారు పొందిన జీతాన్ని తిరిగి ఇవ్వాల్సిందేనని హైకోర్టు తీర్పు ఇచ్చింది. వారు జీతం తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. మూడు నెలల్లోపు కొత్త ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.