తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారికి కోటి రూపాయలు విరాళం ఇచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్ధానం ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించింది. తిరుమల గిరులపై స్వామివారికి ప్రత్యేక ఉత్సవాలు జరిగే రోజులను మినహాయించి మిగిలిన అన్ని రోజులలో కోటి రూపాయలు విరాళం ఇచ్చిన భక్తులు తమకు కల్పింన ప్రత్యేక సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవచ్చని టీటీడీ ప్రజా సంబంధాల అధికారి ఓ ప్రకటనలో తెలిపారు.
రూ. కోటి విరాళం ఇచ్చే దాతలకు జీవితకాలంలో దాతతో పాటు నలుగురికి ప్రతి ఏడాది కొన్ని సౌకర్యాలను టిటిడి కల్పిస్తోంది. సంవత్సరంలో 3 రోజులు సుప్రభాత సేవ మరో 3 రోజులు బ్రేక్ దర్శనం, 4 రోజుల పాటు సుపథం ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు. వీటితోపాటు 10 పెద్ద లడ్డూలు, 20 చిన్న లడ్డూలు, దుప్పట -ఒకటి, రవికే ఒకటి, మహా ప్రసాదం ప్యాకెట్లు10, ఒక సారి వేద ఆశీర్వచనం వంటి సౌకర్యాలను పొందవచ్చు వీటితో పాటుగా రూ. 3 వేలు రుసుం విలువ చేసే వసతి గదుల సదుపాయం 3 రోజులు కల్పిస్తామని టీటీడీ ప్రజా సంబంధాల అధికారి తెలిపారు. ఇవే కాకుండా జీవిత కాలంలో ఒకసారి దాతకు ఒక 5 గ్రాముల శ్రీవారి బంగారు డాలర్ మరియు ఒక 50 గ్రాముల సిల్వర్ డాలర్ ను తగిన ఆధారాలను కార్యాలయం వారికి చూపించి పొందవచ్చు.
దాతలు టిటిడి ట్రస్ట్ లకు విరాళాలు ఇవ్వవచ్చు. కాటేజ్ డొనేషన్ స్కీం, ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్, ఎస్వీ విద్యాదాన ట్రస్ట్, బర్డ్ ట్రస్టు, శ్రీవేంకటేశ్వర అన్నదాన ట్రస్ట్, శ్రీవేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్, శ్రీవేంకటేశ్వర సర్వశ్రేయాస్ ట్రస్ట్, శ్రీవేంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, శ్రీవాణి ట్రస్ట్, శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ ట్రస్ట్, శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదినీ స్కీమ్ (స్విమ్స్) లకు దాతలు విరాళాలు చెల్లించి సంబంధింత సౌకర్యాలను పొందవచ్చు.
దాతలు టిటిడి వెబ్ సైట్ అయిన www.ttddevasthanams.ap.gov.in లో ఆన్ లైన్ ద్వారా విరాళాలు చెల్లించవచ్చు. ఆఫ్ లైన్ లో అయితే దాతలు ఈవో, టిటిడి పేరిట డి.డి/ చెక్ లను తీసుకుని తిరుమలలోని దాతల విభాగంలో ( డోనార్ సెల్) అందజేయాలని టీటీడీ పీఆర్ఓ విడుదల చేసిన ప్రకటనలో సూచించారు.