ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో తొలిసారిగా సరస్వతి నది పుష్కరాలు జరగనున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో ఈ ఏడాది మే 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు సరస్వతీ నది పుష్కరాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సంబంధిత శాఖలను ఆదేశించింది. మంత్రి కొండా సురేఖ ఆదేశాల మేరకు పుష్కరాల ఏర్పాట్ల కోసం దేవాదాయ శాఖ రూ.25 కోట్లు మంజూరు చేసింది. సరస్వతీ నది పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో, వచ్చే వాళ్లందరికీ అవసరమైన మౌలిక సదుపాయాలు, స్నాన ఘట్టాలు, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు వంటి పనులను సమర్థవంతంగా చేపట్టాలని మంత్రి సురేఖ సంబంధిత అధికారులను ఆదేశించారు.
మరోవైపు.. సరస్వతీ నది పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక మొబైల్ అప్లికేషన్ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ యాప్ దేశంలోని భక్తులందరికీ పుష్కరాలకు చేరుకోవడానికి ఒక సమగ్ర గైడ్లా ఉపయోగ పడనుంది. హైదరాబాద్లో మంత్రులు శ్రీధర్బాబు, కొండా సురేఖ చేతుల మీదుగా ఈ యాప్ను ఆవిష్కరించారు. ఈ యాప్లో సాధారణ స్నాన ఘాట్, సరస్వతీ ఘాట్ యొక్క స్థానం, ఆలయానికి చేరుకునే మార్గం, బస్ స్టాండ్ వంటి ప్రయాణ ప్రాంగణాలకు ఎలా వెళ్లాలి, వాహనాలు పార్క్ చేసే ప్రదేశాలు, వైద్య సహాయ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి అనే వివరాలు ఆ యాప్లో చేర్చారు. అంతేకాకుండా, అన్నదాన కేంద్రాలు, ప్రసాదాల విక్రయ కౌంటర్లు, సామాన్లు భద్రపరుచుకునే ప్రదేశాల గురించిన సమాచారాన్ని కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. పుష్కరాలకు వచ్చే భక్తులు కాళేశ్వరం సమీపంలోని ఇతర ప్రసిద్ధ దేవాలయాలైన మేడారం, రామప్ప, లక్నవరం వంటి పర్యాటక ప్రదేశాల వివరాలను కూడా ఈ యాప్లో చూడవచ్చు.