త్రివిధ దళాల్లో నారీశక్తి నినాదానికి అనుగుణంగా మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. తాజాగా రక్షణ శాఖ మీడియా సమావేశంలో మహిళా అధికారులను ముందుకు తీసుకురావటంపై దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది.
పాకిస్తాన్ మీద దాడులకు దిగిన భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మే 7వ తేదీ పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్పై దాడులకు దిగిన వాయుసేన 9 ప్రాంతాల్లోని… 21 ఉగ్రవాద కేంద్రాలపై 25 నిమిషాల్లోగా లక్ష్యాలను ధ్వంసం చేసి వాయుసేన బలగాలు తిరిగివచ్చాయి.
బుధవారం పాకిస్తాన్పై దాడులకు కారణాలను భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వివరించారు. దాడుల వివరాలను కల్నల్ సోఫియా ఖురేషీ వెల్లడించారు. వాయుసేన టార్గెట్ చేసిన కేంద్రాలను వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ వివరించారు. పహల్గామ్ దాడులకు ప్రతీకారంగానే ఉగ్రవాద కేంద్రాలను ధ్వంసం చేసినట్టు..పహల్గామ్ దాడుల ద్వారా బాధితులకు న్యాయం చేస్తున్నామని వెల్లడించారు.
భారత రక్షణ శాఖ మహిళా అధికారులతో దాడుల వివరాలు వెల్లడించటంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సీనియర్ అధికారులు ఎంతో మంది ఉండగా జూనియర్ అధికారులతో మాట్లాడించటం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆర్మీ ఏవియేషన్, నౌకాదళం, వైమానిక దళాల్లో నారీశక్తికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయి. మహిళలు సైన్యంలో పురుషులకు సమానంగా సేవలు అందిస్తున్నారు. సియాచిన్ గ్లేసియర్ లోని కుమార్ పోస్ట్ లో ఒక మహిళా సైనికాధికారిని నియమించడం ద్వారా కొత్త అధ్యాయం ప్రారంభమైంది.
కల్నల్ సోఫియా ఖురేషీ
గుజరాత్కు చెందిన కల్నల్ సోఫియా ఖురేషీ ప్రస్తుతం ఆర్మీ శిక్షణా కేంద్రంలో అధికారిగా వ్యవహరిస్తున్నారు. బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసిన ఆమె సైనిక కుటుంబం నుండి వచ్చింది. ఆమె తాత భారత సైన్యంలో పనిచేశారు. ఆమె మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీకి చెందిన అధికారిని వివాహం చేసుకున్నారు.
ఇండియన్ ఆర్మీ కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్ లో అధికారిణిగా కల్నల్ సోఫియా ఖురేషి విధులు నిర్వహిస్తున్నారు. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా తదితర దేశాలతో కలిసి చేసిన సైనిక విన్యాసాలలో భారత ఆర్మీ బృందానికి నాయకత్వం వహించిన మొదటి మహిళా అధికారిణిగా గుర్తింపు పొందారు. 2016లో భారతదేశం నిర్వహించిన అతిపెద్ద విదేశీ సైనిక విన్యాసం ‘ఎక్సర్సైజ్ ఫోర్స్ 18’లో భారత బృందానికి ఆమె నాయకత్వం వహించారు. విన్యాసాల్లో పాల్గొన్న 18 దేశాల బృందాల్లో ఖురేషీ ఏకైక మహిళా కమాండర్.
ఆరు సంవత్సరాలు UN శాంతి పరిరక్షక దళాల్లో (PKO) పనిచేశారు. కాంగోలోని ఐక్యరాజ్యసమితి మిషన్లో (2006) విధులు నిర్వహించారు. ఆర్మీ దళాల మాజీ చీఫ్ బిపిన్ రావత్ ఒక సందర్భంలో ఖురేషీ గురించి మాట్లాడుతూ.. ఒక మహిళగా కాకుండా సామర్థ్యం, నాయకత్వ లక్షణాల ఆధారంగా ఆమె ఎంపిక జరిగిందని వెల్లడించారు.
ఖురేషీకి ప్రాధాన్యతతో భారత్లో ముస్లింలను అణచివేస్తున్నారని పాకిస్తాన్ చేస్తున్న తప్పుడు ప్రచారానికి అడ్డుకట్ట వేసినట్టయింది.
వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్
ఇంజనీరింగ్ చేసిన వ్యోమిక సింగ్ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC)లో చేరడం ద్వారా తన లక్ష్యం వేసు అడుగులు వేసింది. ఆమె కుటుంబంలో సాయుధ దళాలలో చేరిన మొదటి వ్యక్తిగా నిలిచారు. భారత వైమానిక దళంలో హెలికాప్టర్ పైలట్గా నియమితులయ్యారు మరియు డిసెంబర్ 18, 2019న ఫ్లయింగ్ బ్రాంచ్లో శాశ్వత కమిషన్ పొందారు.
వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ 2,500 కంటే ఎక్కువ గంటలు విమాన ప్రయాణాన్ని పూర్తి చేశారు. జమ్మూ కాశ్మీర్, ఈశాన్య ప్రాంతాలతో సహా కఠినమైన ప్రాంతాల్లో చేతక్, చిరుత వంటి హెలికాప్టర్లను నడిపింది. బహుళ రెస్క్యూ మిషన్లలో కీలక పాత్ర పోషించింది. ఆమె నాయకత్వం వహించిన ప్రధాన మిషన్లలో ఒకటి నవంబర్ 2020లో అరుణాచల్ ప్రదేశ్లో జరిగింది. ఈ ఆపరేషన్లు ఎత్తైన ప్రదేశాలు, క్లిష్ట వాతావరణం, ప్రాణాలను కాపాడటానికి వైమానిక సహాయం కీలకమైన మారుమూల ప్రాంతాలలో నిర్వహించబడ్డాయి.
2021లో 21,650 అడుగుల ఎత్తులోని మౌంట్ మణిరాంగ్కు ట్రై-సర్వీసెస్ ఆల్-మహిళలతో కూడిన పర్వతారోహణ యాత్రలో పాల్గొన్నారు. వ్యోమిక ధైర్య సాహసాల్ని ఎయిర్ స్టాఫ్ చీఫ్ సహా సీనియర్ రక్షణ అధికారులు గుర్తించారు.
కుటుంబం, ఇళ్లుతో దేశ భద్రతలో కూడా మహిళల పాత్ర ఎనలేనిదని చాటిచెప్పారని దేశ ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.