హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బాంబర్ ఠాకూర్ పై కాల్పుల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై 12 రౌండ్ల కాల్పులు జరిపారు. వీరంతా డ్రగ్ ట్రాఫికర్స్ అయి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. స్థానిక నేతలు డ్రగ్ ట్రాఫికర్స్కు సహకరిస్తున్నారని.. ఈ దాడికి వారు సహకరించారని ఆరోపించారు. కొందరు తన కొడుకులను కూడా ఈ డ్రగ్స్ దందాలోకి దించాలని చూశారని.. కానీ వారు బయటపడ్డారని తెలిపారు.
దాడి తర్వాత ఠాకూర్ను మొదట సురక్షిత ప్రదేశానికి తరలించగా.. ఆయన పీఎస్ఓను నేరుగా ఆసుపత్రికి తరలించారు. తరువాత ఠాకూర్ను కూడా ఆసుపత్రిలో చేర్చారు. ఇద్దరినీ మెరుగైన చికిత్స కోసం బిలాస్పూర్ ప్రాంతీయ ఆసుపత్రి నుండి ఎయిమ్స్ బిలాస్పూర్కు తరలించారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.
శుక్రవారం మధ్యాహ్నం బిలాస్ పూర్ మాజీ ఎమ్మెల్యే బాంబర్ ఠాకూర్ తన నివాసంలో ఉండగా నలుగురు దుండగులు ఆయన ఇంట్లోకి చొరబడి ఆయనతోపాటు వ్యక్తిగత భద్రతా సిబ్బందిపై 12 రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటనపై హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు ఈ కాల్పుల ఘటనపై స్పందించారు. గాయపడిన మాజీ ఎమ్మెల్యే బాంబర్ ఠాకూర్తో మాట్లాడినట్లు చెప్పారు. ఆయనకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. తనకు భద్రత పెంచాలని బాంబర్ సీఎంను డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై ఇప్పటికే హిమాచల్ ప్రభుత్వం స్పందించింది. ఈ ఘటనపై ఓ కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగుకుండా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం నిర్ణయించింది.