హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్ హౌస్ సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల నష్ట పరిహారం ప్రకటించింది. ఈ అగ్నిప్రమాదంలో 17 మంది మృతి చెందడంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రకటించింది. ఉదయం అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసన దగ్గర నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్లను ఘటనా స్ధలానికి వెళ్ళి సహాయక చర్యలను పర్యవేక్షించమని సీయం ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉస్మానియా ఆసుపత్రికి వెళ్ళి క్షతగాత్రులను, మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించడంతో పాటు గుల్జార్ హౌస్ ప్రాంతానికి వెళ్లి అగ్నిప్రమాదం జరిగిన భవనానన్ని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీయం మీడియాతో మాట్లాడుతూ సీయం ఆదేశాల మేరకు మధిర నుంచి హుటాహుటీన ఉస్మానియా ఆసుపత్రికి చేరుకున్నానని తెలిపారు. మూడు నిమిషాల్లో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్ధలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేయడం పట్ల డిప్యూటీ సీయం అగ్నిమాపక సిబ్బందిని అభినందించారు. ఇతర ప్రాంతాలకు అగ్ని వ్యాప్తి జరగకుండా ఫైర్ ఫైటర్స్ చర్యలు చేపట్టారని లేకపోతే భారీ అస్తి, ప్రాణ నష్టాలు జరిగి ఉండేవని భట్టి ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ముందు గుల్జార్ హౌస్ వంటి సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీయం ప్రకటించారు. రెండు మూడు రోజుల్లో ఉన్నతాధికారులతో భేటీ అయ్యి అగ్నిప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకుంటామని భట్టి విక్రమార్క ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారని తెలిపారు. మంటలు అదుపులోకి తెచ్చే క్రమంలో ఫైర్ ఫైటర్ ఒకరు తీవ్ర అస్వస్ధతకు గురయ్యాడని, అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని డిప్యూటీ సీయం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.