- ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించిన దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వినయ్ చంద్
- స్వామివారిని దర్శించుకున్న మంత్రులు,ఎమ్మెల్సీలు,ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు
- అర్ధరాత్రి 12.30 గం.ల నుంచే ప్రారంభమైన క్షీరాభిషేకాలు
- భారీ ఎత్తున పోలీసు బందోబస్తు
రధసప్తమి సందర్భంగా సూర్యభగవానుడి సుప్రసిద్ద పుణ్యక్షేత్రం అరసవల్లిలో భక్తులు మంగళవారం స్వామివారి నిజరూప దర్శనం చేసుకున్నారు. రధసప్తమి పండుగ కారణంగా సోమవారం అర్ధరాత్రి 12.30 గంటల నుంచే స్వామి వారికి క్షీరాభిషేకాలు ప్రారంభమయ్యాయి. స్వామివారి నిజరూప దర్శనం కోసం రాష్ట్రం నలుమూలల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి అరసవల్లి తరలి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రథసప్తమిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి వాడ్రేవు వినయ్చంద్ సూర్యనారాయణుడికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు.
కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్నాయుడు, శాసనసభ్యులు భగ్గు రమణమూర్తి, గౌతు శిరీష, గొండు శంకర్, మామిడి గోవిందరావు, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ తదితరులు కుటుంబ సమేతంగా సూర్యనారాయణుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా జడ్జి జస్టిస్ జునైద్ అహ్మద్ మౌలానా, విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి, ఎస్పీ కేవీమహేశ్వరరెడ్డిలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన అనేక మంది ఉన్నతాధికారులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు భారీగా తరలిరావడంతో భారీఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అరసవల్లికి వచ్చే వాహనాల రాకపోకలను ప్రత్యేక దారుల మీదుగా మళ్లించారు. రథసప్తమి సందర్భంగా వేలాదిగా తరలి వచ్చిన భక్తులకు పలు స్వచ్ఛంద సంస్థలు అన్నదానాలు చేయడం, మంచినీటి సరఫరా, పిల్లలకు పాలు, భక్తులకు మజ్జిగ వంటివి సరఫరా చేశాయి. ఇంద్రపుష్కరిణి గట్టుపై మహిళలు పిడకలపై ఆవుపాలు, బియ్యం, పంచదారతో పరమాన్నం తయారుచేసి, సూర్యనారాయణస్వామికి నివేదించి పూజలు నిర్వహించారు.